జైషె చీఫ్ మసూద్ అజర్ ఆస్తులు జప్తు: యూరోపియన్ దేశాల జాబితాలో అతని పేరు చేర్చడానికి ఏర్పాట్లు!
ప్యారిస్: భయానక ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ కు ఫ్రాన్స్ ప్రభుత్వం ఊహించని దెబ్బ కొట్టింది. జైషె మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు చెందిన ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం.
ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ అవకాశం వస్తే.. మేమెందుకు వద్దంటాం: నాటి ప్రధాని నెహ్రూ
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద కిందటి నెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసిన జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మారణహోమాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
ఈ ఘటన తరువాత ఫ్రాన్స్ ప్రభుత్వం జైషె సంస్థ కార్యకలాపాలపై నిఘా వేసింది. మసూద్ అజర్ కు తమ దేశంలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. వాటన్నింటినీ వెంటనే జప్తు చేయాలని ఆదేశిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ఫ్రాన్స్ అంతర్గత భద్రత మంత్రిత్వశాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.
మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సాధ్యం పడట్లేదు. దీనితో- మసూద్ అజర్ ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ.. యూరోపియన్ యూనియన్ దేశాల జాబితాలో అతని పేరును చేర్చడానికి చర్యలు తీసుకుంటామని ఫ్రాన్స్ ఈ ప్రకటనలో తెలియజేసింది.
మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాది సంస్థగా గుర్తించడానికి చైనా అంగీకరించట్లేదు. దీనితో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చైనా మినహా అన్ని దేశాలూ ఈ విషయంలో భారత్ కు అండగా నిలుస్తున్నాయి. చైనా మాత్రం పాకిస్తాన్ తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నందు.. ప్రస్తుతం ఆ దేశంలోనే ఉన్న మసూద్ అజర్ పై అంతర్జాతీయ ఉగ్రవాది అనే ముద్ర వేయడానికి వెనుకంజ వేస్తోంది.