ఉగ్రవాది మసూద్ అజర్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడా? ధృవీకరించిన పాక్ విదేశాంగ మంత్రి: అనుమానాలెన్నో
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడా? ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టలేని స్థితిలో ఉన్నాడా? అంటే అవుననే సమాధానమిస్తున్నారు స్వయంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ. తనకు ఉన్న సమాచారం ప్రకారం.. మసూద్ అజర్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడని, ఇంటి నుంచి కదలలేని స్థితిలో ఉన్నాడని ఆయన ధృవీకరించారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఖురేషీ ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత వైమానిక దళం నిర్వహించిన దాడుల్లో మసూద్ అజర్ గాయపడి ఉండొచ్చంటూ ప్రాథమికంగా సమాచారం అందినప్పటికీ.. ఖురేషీ దాన్ని తోసిపుచ్చారు. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. దాడుల సమయంలో అజర్ సంఘటనా స్థలంలో లేరని అన్నారు. అజర్ తమ దేశంలోనే ఉన్నాడని ఆయన పునరుద్ఘాటించారు. తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడని చెప్పారు. అతని విషయంలో ఇంతకుమించి తానేమీ వెల్లడించలేనని ఖురేషీ స్పష్టం చేశారు.
న్యాయస్థానాలు అంగీకరించే సాక్ష్యాలు ఇస్తేనే..
మసూద్ అజర్ ను భారత్ కు అప్పగించడం అనే విషయం అంత తేలిక కాకపోవచ్చని ఖురేషీ అభిప్రాయపడ్డారు. అతను ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఖచ్చితమైన ఆధారాలు ఉంటేనే అతణ్ని అప్పగిస్తామని, ఇందులో సందేహాలు అక్కర్లేదని తన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సాక్ష్యాధారాలన్నీ `పాకిస్తాన్ న్యాయస్థానాలు అంగీకరించేవి`గా ఉండాలని, అప్పుడే అతని అప్పగింత సులువు అవుతుందని అన్నారు. న్యాయపరమైన చిక్కులు అడ్డుగా ఉండకూడదనే ఉద్దేశంతోనే సరైన సాక్ష్యాధారాలు అవసరమని ఖురేషీ చెప్పారు.
బాంబు దాడుల్లో గాయపడ్డాడా?
పాకిస్తాన్ ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ లో ఉన్న బాలాకోట్ సమీపంలో జైషె మహమ్మద్ కు చెందిన అతి పెద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరంపై మనదేశ వైమానిక దళం బాంబుల వర్షం కురిపించిన తరువాత ఖురేషీ ఈ ప్రకటన చేయడం అనేక అనుమానాలకు తెర తీసింది. బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై దాడి చేసిన సందర్భంగా అతను గాయపడి ఉండొచ్చని చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై దాడికి దగ్గరుండి పథకం రచించిన మసూద్ అజర్.. ఈ కొద్దిరోజుల వ్యవధిలో తీవ్ర అనారోగ్యం బారిన పడటం నమ్మశక్యం కాని విషయమంటూ వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.
కాపాడే ప్రయత్నమా?
పుల్వామా ఉగ్రదాడి తరువాత మసూద్ అజర్ అంతర్జాతీయ స్థాయిలో ఏకాకి అయ్యారు. దాదాపు అన్ని దేశాలు కూడా అతణ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం ఆరంభించాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధికారికంగా ఓ తీర్మానం అంటూ చేస్తే, పాకిస్తాన్ కూడా అతణ్ని కాపాడలేదు. ఏ దేశం కూడా అతనికి ఆశ్రయం ఇవ్వదు. ఈ పరిస్థితుల్లో సానుభూతిని కూడగట్టడానికి పాకిస్తాన్ వేసిన ఎత్తుగడగా కూడా అభివర్ణిస్తున్నారు. మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నాడనే విషయం పాకిస్తాన్ ప్రభుత్వానికి విస్పష్టంగా తెలుసు. అతని ఆనుపానులపై, కదలికలపై పాక్ ప్రభుత్వానికి పక్కా సమాచారం ఉంది. అయినప్పటికీ.. అతణ్ని ముట్టుకునే సాహసం ఏనాడూ చేయలేదు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తింపు పొందుతున్న క్రమంలో.. మరోసారి మసూద్ అజర్ ను పాకిస్తాన్ కాపాడే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శలు ఉన్నాయి.
మసూద్ అజర్ దారుణాలు అన్నీ, ఇన్నీ కావు..
కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్. మనదేశాన్ని లక్ష్యంగా చేసుకుని అనేకసార్లు ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. మొన్నటి పుల్వామా ఉగ్రదాడి వెనుక ఉన్నమాస్టర్ మైండ్ కూడా అజరే. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. 2001లో మనదేశ పార్లమెంట్ భవనంపై దాడి చేయడానికి సూత్రధారి కూడా అతనే. 2016లో పంజాబ్ లోని పఠాన్ కోట్ లో భారత వైమానిక దళానికి చెందిన బేస్ క్యాంప్ పై దాడి చేసింది జైషె మహమ్మద్ ఉగ్రవాదులే. అదే ఏడాది జమ్మూ కాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో భారత జవాన్ల శిబిరంపైనా ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులు దాడి చేశారు. భారత కారాగారంలో మగ్గుతున్నఅజర్ ను కాందహార్ విమానం హైజాక్ సమయంలో ఉగ్రవాదుల డిమాండ్ల మేరకు విడిచిపెట్టింది అప్పటి కేంద్ర ప్రభుత్వం.