జైషె మహమ్మద్ పై పాక్ నాటకాలు: ఆ సంస్థ ఉనికే లేదంటోన్న ఆ దేశ ఆర్మీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరో సరికొత్త నాటకానికి తెర తీసింది. జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నాడంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మొహమూద్ ఖురేషీ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే.. దీనికి భిన్నమైన ప్రకటన చేసింది ఆ దేశ ఆర్మీ. తమదేశంలో జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉనికే లేదని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు.
బుధవారం ఆయన ఓ అంతర్జాతీయ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. జైషె మహమ్మద్ సంస్థ తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తోందనడానికి పాకిస్తాన్ ఏమాత్రం అంగీకరించట్లేదనే విషయం దీనితో బట్టబయలైంది. పాకిస్తాన్ భూభాగంపై జైషె మహమ్మద్ కార్యకలాపాలేవీ కొనసాగట్లేదని ఆసిఫ్ గఫూర్ చెప్పారు.
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద కిందటి నెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై చోటు చేసుకున్న ఉగ్రవాద దాడి తమ పనేనంటూ జైషె మహమ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరహా దాడులన్నీ తమ దేశ భూభాగం మీద నుంచి కొనసాగట్లేదని, పాకిస్తాన్ వెలుపలి నుంచి నిర్వహిస్తున్నారనే సమాచారం తనకు ఉందని ఆసిఫ్ గఫూర్ చెప్పారు.
అమెరికా, ఐరాస కూడా అదే చెప్పిందంటూ..
జైషె మహమ్మద్ సంస్థ ఉనికి తమ దేశంలో లేదని, ఐక్యరాజ్య సమితి, అమెరికా కూడా ఇదే విషయాన్ని నిర్దారించాయని గఫూర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో తమపై ఒత్తిడి తీసుకొస్తారని తాము ఎలాంటి కీలక నిర్ణయాలు గానీ, చర్యలు గానీ తీసుకోబోమని ఆయన అన్నారు.
ఖురేషీ చెప్పిందేంటీ..
మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నారని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని స్థితిలో ఉన్నాడని అంటూ కొద్దిరోజుల కిందటే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మొహమూద్ ఖురేషీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఓ అంతర్జాతీయ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే వెల్లడించారు. ఉగ్రదాడులు మసూద్ అజర్ పనేనని అనడానికి సరైన సాక్ష్యాధారాలు చూపించగలిగితే.. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఖురేషీ చెప్పారు.
యుద్ధ వాతావరణం తొలగిపోలేదు..
దీనికి భిన్నంగా గఫూర్ ప్రకటన చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. భారత్ తో యుద్ధ వాతావరణం పూర్తిగా తొలగిపోలేదని ఆయన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిబంధనలు, ఒప్పందాలను అధిగమిస్తూ, భారత్ వైమానిక దళం..నియంత్రణ రేఖను దాటుకుని తమ గగనతలంలోకి ప్రవేశించాయని అన్నారు. దీనికి తాము సరైన బదులు ఇచ్చి తీరుతామని అన్నారు. అది ఏ రూపంలో ఉంటుందో తాను ఇప్పుడే చెప్పలేనని గఫూర్ పేర్కొన్నారు.
బాలాకోట్ దాడుల్లో ఇటుక కూడా పడిపోలేదు..
బాలాకోట్
పై
భారత
వైమానిక
దాడులపై
గఫూర్
స్పందిస్తూ..
భారత్
తప్పుడు
ప్రకటనలు
చేస్తోందని
అన్నారు.
బాలాకోట్
లో
300
మంది
ఉగ్రవాదులు
హతమయ్యారంటూ
వస్తోన్న
వార్తల్లో
నిజం
లేదని
చెప్పారు.
బాలాకోట్
దాడుల
వల్ల
ఆ
ప్రాంతంలో
ఒక్క
ఇటుక
కూడా
రాలి
పడిపోలేదని
గఫూర్
అన్నారు.
ఏ
ఒక్కరు
కూడా
చనిపోలేదని,
దీనిపై
తన
వద్ద
గట్టి
సాక్ష్యాధారాలు
ఉన్నాయని
చెప్పారు.
ఇప్పుడిక బంతి భారత్ కోర్టులో..
రెండు దేశాల మధ్య శాంతియుతా వాతావరణాన్ని నెలకొల్పడంలో భాగంగా తాము భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను విడుదల చేశామని గఫూర్ తెలిపారు. ఇప్పుడు బంతి భారత్ కోర్టులో ఉందని అన్నారు. తాము శాంతిని కాంక్షిస్తున్నామని, అభినందన్ విడుదలే దీనికి నిదర్శనమని చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెంచాలా? లేదా నియంత్రించాలా? అనేది భారత్ తేల్చుకోవాలని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులను భారత్ కొనసాగించదలిచితే.. పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతాయని గఫూర్ పరోక్షంగా హెచ్చరించారు.