బైడెన్ వైట్ హౌస్ టీమ్లోకి వినయ్రెడ్డి... ఇంతకీ ఎవరాయన..బ్యాక్గ్రౌండ్ ఏంటి..?
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ తన టీమ్లో మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు. అధ్యక్ష కార్యాలయ సిబ్బంది డిప్యూటీ డైరెక్టర్గా గౌతమ్ రాఘవన్,స్పీచ్ రైటింగ్ డైరెక్టర్గా వినయ్ రెడ్డిల పేర్లను మంగళవారం(డిసెంబర్ 22) ఖరారు చేశారు. ఇప్పటికే కమలా హారిస్ను ఉపాధ్యక్షురాలిగా,నీరా టాండన్ను బడ్జెట్ చీఫ్గా, వేదాంత్ పటేల్లను వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా బైడెన్ తన టీమ్లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే.
గౌతమ్ రాఘవన్ గతంలో ఒబామా వైట్ హౌస్ టీమ్లోనూ పనిచేశారు. ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ టీమ్లో చీఫ్ స్టాఫ్గా కూడా వ్యవహరించారు. వినయ్ రెడ్డి జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ఇంతకుముందు బైడెన్ క్యాంపెయిన్ స్టాఫ్గా పనిచేసిన వినయ్ ప్రస్తుతం స్పీచ్ రైటర్స్ టీమ్ హెడ్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ ఇద్దరితో పాటు మరో నలుగురికి బైడెన్ తన టీమ్లో చోటు కల్పించారు. ఇందులో గతంలో ఒబామా టీమ్లో పనిచేసిన అన్నె ఫిలిపిక్ ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ డైరెక్టర్&మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించారు. ర్యాన్ మోంటోయా అనే ఒబామా మాజీ స్టాఫ్కి డైరెక్టర్ ఆఫ్ షెడ్యూలింగ్ & అడ్వాన్స్ బాధ్యతలు అప్పగించారు. బైడెన్తో చాలాకాలంగా పనిచేస్తున్న బ్రూస్ రీడ్కి డిప్యూటీ చీఫ్ స్టాఫ్,ఎలిజబెత్ విల్కిన్స్ని చీఫ్ స్టాఫ్ సీనియర్ అడ్వైజర్గా నియమించారు.
ఈ ఏడాది నవంబరు 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి బైడెన్కు 306 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు రాగా రిపబ్లికన్ నేత డొనల్డ్ ట్రంప్కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సమావేశమైన ఎలక్టోరల్ కాలేజ్ బైడెన్ విజయాన్ని నిర్దారించడంతో అధ్యక్ష పీఠంపై కూర్చొనేందుకు అధికారిక ద్వారాలు తెరుచుకున్నాయి. బైడెన్ గెలిచినట్లు ఎలక్టోరల్ కాలేజ్ నిర్ధారిస్తే వచ్చే జనవరిలో తాను వైట్ హౌస్ను వీడుతానని ఇదివరకే ట్రంప్ ప్రకటించారు.