కీలక స్పీచ్: జో బైడెన్కు భద్రత పెంచుతున్న అమెరికా సీక్రెట్ సర్వీస్
వాషింగ్టన్: తదుపరి అమెరికా అధ్యక్షుడు ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ..ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ జోరు జూపిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బైడెన్ సత్తా చాటారు. దాదాపు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఖరారైనట్లేనని చెప్పవచ్చు.
షాక్: వారం తర్వాతే అమెరికా ఫలితాలు -9రాష్ట్రాల్లోనే ఆలస్యం ఎందుకంటే -భారత ఈసీకి జేజేలు
ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం జో బైడెన్కు భద్రతను పెంచుతున్నట్లు సమాచారం. బైడెన్ భద్రతను పెంచేందుకు అమెరికా సీక్రెట్ సర్వీసు సంస్థ అధికారులను పంపించినట్లు వాషింగ్టన్ పోస్టు తన కథనంలో పేర్కొంది.
విల్మింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బైడెన్ శుక్రవారం కీలక ప్రసంగం చేసే అవకాశం ఉందని, దీంతో ఆయనకు భద్రత కల్పించేందుకు సీక్రెట్ సర్వీసు ఏర్పాట్లు చేస్తోందని ఈ ప్రణాళికల్లో భాగమైన ఇద్దరు సీనియర్ అధికారులు వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.
బైడెన్ తన ప్రసంగానికి విల్మింగ్టన్ సెంటర్ను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన ప్రచార వర్గం సీక్రెట్ సర్వీస్కు సమాచారం ఇచ్చిందని.. ఈ క్రమంలోనే భద్రత పెంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. ప్రస్తుతం ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ బైడెన్, ట్రంప్ మధ్య తేడా స్వల్పంగానే ఉంది.
జో బైడెన్ ఇప్పటికే 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లను మాత్రమే దక్కించుకున్నారు. మేజిక్ ఫిగర్ 270కి జో బైడెన్ చాలా దగ్గరగా ఉండగా, ట్రంప్ మాత్రం చాలా వెనకబడి ఉన్నారు. జో బైడెన్ కేవలం ఆరు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధిస్తే తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది.