జో బైడెన్: ‘మా ఎన్నికల్లో జోక్యం వద్దు...’ పుతిన్కు తొలి ఫోన్ కాల్లోనే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడిన మొదటి ఫోన్ కాల్లోనే ఎన్నికల్లో జోక్యం గురించి హెచ్చరించారని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది.
రష్యాలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతిపక్ష నిరసనల గురించి కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.
అయితే, రష్యా అధ్యక్ష భవనం జారీ చేసిన ప్రకటనలో వివాదాస్పద అంశాల ప్రస్తావన విషయం లేదు. ఆ ఫోన్ కాల్ చర్చ సాధారణంగా, సూటిగా ఉందని పేర్కొంది.
ఇరు దేశాల మధ్య మిగిలివున్న చివరి అణు ఒప్పందాన్ని సమీక్షించటానికి ఇరువురు నాయకులూ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రష్యా విషయంలో తన ప్రభుత్వ కఠిన వైఖరిని పలుమార్లు నీరుగార్చారని, పుతిన్ వ్యవహారం పట్టనట్లు వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా (ఆయన వద్ద జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు).. క్రిమియాను రష్యా తనలో కలుపుకోవటాన్ని, ఉక్రెయిన్లో తిరుగుబాటుదారులకు రష్యా మద్దతును, సిరియాలో రష్యా బలోపేతం కావటాన్ని నిరోధించలేకపోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు.
- కమలా హారిస్: భారత మూలాలున్న ఈ 'నల్ల కలువ’కు ఎన్నో అస్తిత్వాలు
- జో బైడెన్, కమలా హారిస్లకు అభినందనలు తెలుపుతూ వివిధ దేశాల ప్రముఖులు ఏమన్నారు?
అమెరికా, రష్యా అధ్యక్ష కార్యాలయాలు ఏం చెప్పాయి?
''మా దేశానికి, మా మిత్రదేశాలకు హాని కలిగించే రష్యా చర్యలకు ప్రతిస్పందనగా మా దేశ జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం అమెరికా దృఢంగా చర్యలు చేపడుతుందని అధ్యక్షుడు బైడెన్ స్పష్టంచేశారు’’ అని శ్వేతసౌధం ఒక ప్రకటనలో తెలిపింది.
రష్యా పనిగా ఆరోపణలున్న భారీ సోలార్విండ్స్ సైబర్ దాడి గురించి కూడా ఇరువురు దేశాధినేతలూ చర్చించారని చెప్పింది. అఫ్ఘానిస్తాన్లో అమెరికా సైనికులను చంపితే నగదు బహుమతులు ఇస్తామని రష్యా ప్రకటించిందనే వార్తల మీద, రష్యా ప్రతిపక్ష కార్యకర్త అలెక్సీ నావల్నీ మీద విషప్రయోగం అంశం గురించి కూడా చర్చించినట్లు పేర్కొంది.
ఈ ఫోన్ సంభాషణ గురించి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటనలో.. ''రష్యా, అమెరికాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావటం ఇరు దేశాలకు ప్రయోజనం కలిగిస్తుంది.. ప్రపంచంలో భద్రత, సుస్థిరతలను కాపాడటంలో తమ బాధ్యతలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు అంతర్జాతీయ సమాజానికీ ప్రయోజనం కలిగిస్తుంది’’ అని తమ దేశాధ్యక్షుడు సూచించినట్లు చెప్పింది.
అమెరికా, రష్యాల అణ్వాయుధ భాండాగారాల్లో వార్హెడ్లు, క్షిపణులు, లాంచర్ల సంఖ్యను పరిమితం చేయటం కోసం ఒబామా హయాంలో చేసుకున్న 'న్యూ స్టార్ట్’ ఒప్పందాన్ని సమీక్షించి కొత్తగా ఒప్పందం చేసుకోవటానికి ఇరువురు నేతలూ ఒక అంగీకారానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.
ఈ ఒప్పందం కాల పరిమితి వచ్చే నెలలో ముగియనుంది. దీనిపై కొత్తగా ఒప్పందం చేసుకోవటానికి డోనల్డ్ ట్రంప్ నిరాకరించారు.
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ ఉద్యమం ఎలా పుట్టిందంటే...
బైడెన్ ఘర్షణ కోరుకోవటం లేదు: బార్బరా ప్లెట్-ఉషర్
వ్లాదిమిర్ పుతిన్ విషయంలో డోనల్డ్ ట్రంప్ కన్నా తాను కఠినంగా వ్యవహరిస్తానని జో బైడెన్ సంకేతాలిచ్చారు.
2016, 2020 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవటానికి రష్యా ప్రయత్నించిందనే విషయం తనకు తెలుసునని పుతిన్తో బైడెన్ చెప్పినట్లు కథనాలు వచ్చాయి. ఇది ట్రంప్ వ్యవహార శైలికన్నా చాలా భిన్నమైనది.
సైబర్ గూఢచర్యం, మరే ఇతర దాడుల నుంచి తమ దేశాన్ని, తమ మిత్ర దేశాలను రక్షించుకోవటానికి అమెరికా సిద్ధంగా ఉందని కూడా రష్యా అధ్యక్షుడిని బైడెన్ హెచ్చరించారు.
ట్రంప్ రాజీ ధోరణి ప్రదర్శించినప్పటికీ.. ఆయన అధ్యక్ష హయాంలో రష్యా లబ్ధి పొందలేకపోయింది. ఉక్రెయిన్ అంశం మొదలుకుని అసమ్మతివాదులపై దాడుల వరకూ అనేక అంశాలు ప్రాతిపదికగా ట్రంప్ ప్రభుత్వం రష్యా మీద భారీ ఆంక్షలు విధించటం అందుకు కారణం.
మానవ హక్కులు, యూరప్లో పుతిన్ ఉద్దేశాల అంశంపై జో బైడెన్, ఆయన విదేశాంగ బృందం కఠిన వైఖరిని అవలంబిస్తుంది.
అయితే వారు ఘర్షణ పడాలనే ఆలోచనలో లేరు.
సాధ్యమైన అంశాల్లో సహకారం, సంబంధాలను నెలకొల్పుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఆ కోణంలో.. 'న్యూ స్టార్ట్’ ఆయుధ నియంత్రణ ఒప్పందం వచ్చే నెలలో ముగిసిపోవటానికి ముందుగా దానిని కొనసాగించే పనిని పూర్తిచేయటానికి ఇరువురు అధ్యక్షులూ అంగీకరించారు.
- మద్రాసీ మూలాలున్న ఈమె అమెరికా అధ్యక్ష పీఠమెక్కే తొలి మహిళ అవుతారా?
- తులసీ గబార్డ్: అమెరికా అధ్యక్ష పీఠంపై ఈ హిందూ మహిళ కూర్చోగలరా?
'న్యూ స్టార్ట్’ ఒప్పందం ఏమిటి?
2010లో సంతకాలు చేసిన ఈ ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల్లో దీర్ఘ శ్రేణి అణ్వస్త్ర వార్హెడ్ల సంఖ్య 1,550 మించరాదు. అంతకుముందలి ఒప్పందం కన్నా ఈ సంఖ్య తక్కువ.
అలాగే.. ఇరు దేశాల్లో ఒక్కో దేశం మోహరించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, సబ్మెరీన్ ద్వారా లాంచ్ చేసే బాలిస్టిక్ మిసైళ్లు, అణ్వాయుధాలతో కూడిన హెవీ బాంబర్ల సంఖ్య 700 మించకూడదు.
వినియోగించటానికి మోహరించని క్షిపణులు మరో 100 వరకూ అనుమతి ఉంది.
వాస్తవ ఒప్పందం కన్నా ఇది కూడా గణనీయమైన తగ్గుదలే.
ఇవి కూడా చదవండి:
- రైతుల నిరసనలు: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని ఆ నలుగురు ఎవరు?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)