జూలై 27న ఖగోళ అద్భుతం మిస్కాకండి, శతాబ్ధంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం
న్యూఢిల్లీ: 21వ శతాబ్ధంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం ఈ నెల 27వ తేదీన ఏర్పడనుంది. జూలై 27న ఏర్పడనున్న చంద్రగ్రహణం అరుణ వర్ణంలో 1.45 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. జులై 27న రాత్రి గం.10.44 ని.లకు చంద్రగ్రహణం ప్రారంభం కానుండగా తెల్లవారుజామున ఐదుగంటల వరకు భూమి నీడ చంద్రునిపై కొనసాగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
భూగ్రహ ఛాయలు అదృశ్యం కావాల్సి ఉన్నప్పటికీ పరావర్తనం చెందిన సూర్య కిరణాల వల్ల పూర్తిగా ఎరుపు వర్ణంలోనే చంద్రుడు కనిపిస్తాడు. దీనిని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. భూమికి, చంద్రుడికి సుదూరంగా ఉన్న అంగారక గ్రహాన్ని చూసే అవకాశం ఆ రోజున లభించనుంది. ప్రతి పదిహేనేళ్లకు ఓసారి భూమికి సమీపంగా వచ్చే అంగారక గ్రహం ఆ రోజును స్పష్టంగా కనిపించనుంది.
తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆసియా, దక్షిణాసియా, అమెరికా, యూరప్ దేశాల్లో ఈ గ్రహణాన్ని స్పష్టంగా చూసే అవకాశముంది. ఆ సమయంలో భూమి చుట్టూ నీడలు అలుముకుంటాయి.