కెనడా కొత్త ప్రధానిగా ట్రూడో: 19స్థానాల్లో ఎన్నారైలు
టొరంటో: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఉదారవాదానికి పట్టం కట్టారు. కెనడాను పదేళ్లపాటు పాలించిన ప్రస్తుత ప్రధాని స్టీఫెన్ హార్పర్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీని మట్టికరిపించి లిబరల్ పార్టీకి అనూహ్య విజయాన్ని అందించారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 338 సీట్లకుగానూ 184 సీట్లలో లిబరల్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.
ఈ విజయంతో లిబరల్ పార్టీ నేత, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కుమారుడు జస్టిన్ ట్రూడో నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నారు. మాంట్రియల్లో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ట్రూడో మాట్లాడుతూ.. కెనడా తిరిగి ఒకప్పటి దేశంగా మారబోతోందని ప్రకటించారు.
19 స్థానాలు గెలుచుకున్న ప్రవాసభారతీయులు
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అభ్యర్థులు రికార్డుస్థాయిలో 19 సీట్లను గెలుచుకున్నారు. దీంతో ఆ దేశ పార్లమెంట్లో భారత సంతతి సభ్యుల సంఖ్య రెట్టింపు అయింది. మొత్తం 338 స్థానాలకు జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ నుంచి 15 మంది, కన్జర్వేటివ్ పార్టీ నుంచి ముగ్గురు, ఎన్డిపి (న్యూ డెమోక్రటిక్ పార్టీ) నుంచి ఒకరు చొప్పున భారత సంతతి అభ్యర్థులు విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన దీపక్ ఓబ్రాయ్ (65) కాల్గరీ ఫారెస్ట్ లాన్ నియోజకవర్గం నుంచి ఏడోసారి పార్లమెంట్కు ఎన్నికవడం విశేషం. గతంలో అటు ప్రభుత్వంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ పనిచేసిన తనకు ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మంచి బలమైన రికార్డు ఉందని, అందుకే ప్రజలు తనను మరోసారి ఎన్నుకున్నారని ఓబ్రాయ్ తెలిపారు.
లిబరల్ పార్టీ అభ్యర్థిగా గతంలో రెండుసార్లు పార్లమెంట్కు ఎన్నికైన దర్శన్ కాంగ్ ఈసారి కాల్గరీ స్కైవ్యూ నియోజకవర్గంలో సహచర భారత సంతతి అభ్యర్థులు దేవీందర్ షోరీ (కన్జర్వేటివ్ పార్టీ), సహజ్వీర్ సింగ్ రాంధ్వా (ఎన్డిపి)లను ఓడించి చరిత్ర సృష్టించగా, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన భారత సంతతి సభ్యుడు టిమ్ ఉప్పల్ ఎడ్మాంటన్ మిల్ ఉడ్స్ సీటును నిలబెట్టుకున్నారు.
అలాగే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఇతర భారత సంతతి అభ్యర్థుల్లో లిబరల్ పార్టీకి చెందిన రాజ్ గ్రేవల్, రమేష్ సంఘా, కమల్ ఖేరా, రూబీ సహోతా, సోనియా సిద్ధూ, నవ్దీప్ బైన్స్, గగన్ సికంద, రాజ్ సైనీ, బర్దీష్ ఛగ్గర్, యాస్మిన్ రతాన్సీ, చంద్ర ఆర్యా, హర్జీత్ సజ్జన్, సుఖ్ ధలీవాల్, జతీ సిద్ధూ, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బాబ్ సరోయా, ఎన్డిపికి చెందిన జస్వీర్ సంధూ ఉన్నారు.