సూసైడ్ బాంబు అటాక్: కాబుల్లో మారణహోమం, 95 మంది మృతి
కాబుల్: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్లో శనివారం తాలిబన్లు మారణ హోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 95 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ దాడిలో 150 మందికి పైగా గాయపడ్డారు.
అంబులెన్సులో భారీగా పేలుడు పదార్థాలు నింపి దానిని పేల్చేశారు. పేలుడు చోటు చేసుకోగానే ప్రజలు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పేలుడు తమ పనేనని తాలిబన్లు ప్రకటించారు.
తాలిబన్ అనుబంధ సంస్థ హక్కానీ నెట్ వర్క్ పాత్ర ఉండవచ్చునని ఆఫ్గన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతర్యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న కాబుల్లో ఇటీవల చోటు చేసుకున్న అతిపెద్ద దాడి ఇది.
పేలుడు ధాటికి పలు భవంతులు, కార్యాలయాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మృతదేహాలు, రక్తమోడుతున్న క్షతగాత్రులతో ఆ ప్రాంతం భీతావహ వాతావరణం కనిపించింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాల అద్దాలు కూడా పగిలిపోయాయి. సమీపంలోని భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ఈ పేలుడు భారత్ ఎంబసీకి 400 మీటర్ల దూరంలో సంభవించింది. ఇక్కడ పలు అంతర్జాతీయ సంస్థలు, విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్నాయి.
అంబులెన్స్ డ్రైవర్ ఆసుపత్రికి రోగిని తీసుకు వెళ్తున్నట్లు నటిస్తూ మొదటి చెక్ పోస్టును దాటాడు. రెండో చెక్ పాయింట్ వద్ద పోలీసులు అంబులెన్సును ఆపేందుకు ప్రయత్నించగా వేరే దారికి మళ్లించాడు. పోలీసులు అంబులెన్సుకు అడ్డుపడటంతో పేలుడు పదార్థాలతో నిండిన ఆ వాహనాన్ని డ్రైవర్ పేల్చేశాడు.