ఎంబసీ జోన్లో ఆత్మాహుతి దాడి...13 మంది దుర్మరణం
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన కాబూల్ దౌత్యకార్యాలయ జోన్ సమీపంలో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ పేలుడులో 13 మంది మృతిచెందగా, మరో 13 మంది వరకు గాయపడ్డారు.
కాబూల్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన కాబూల్ దౌత్యకార్యాలయ జోన్ సమీపంలో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఆ సమీపంలోని కార్యాలయాల తలుపులు, అద్దాలు పగిలిపోయాయి.
వివిధ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండటంతో ఒక్కసారిగా భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఈ పేలుడులో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది వరకు గాయపడినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా ఎంబసీకి సమీపంలో ఉన్న కాబూల్ గ్రీన్ జోన్లో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసుల వాహనాలు, అంబులెన్స్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించాయి.
బుధవారం అందరూ బిజీగా ఉన్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన సిటీ ఆసుపత్రులకు తరలించినట్టు ప్రజారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఉగ్రదాడికి.. తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. అయితే ఆఫ్ఘానిస్తాన్ నిఘా సంస్థ అధికారులు మాత్రం ఈ ఉగ్రదాడి.. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదుల పనిగా భావిస్తున్నారు. వీరికి తాలిబన్లు సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు.