కాబూల్ యూనివర్సిటీలో మారణహోమం -ఉగ్రదాడిలో 19మృతి విద్యార్థులు మృతి -మరో22మంది విషమం
సుదీర్ఘ యుద్ధం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న అఫ్గనిస్థాన్ లో మళ్లీ నెత్తుటి ఏరులు పారాయి. రాజధాని కాబూల్ నగరంలో సాయుధ టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించారు. ప్రఖ్యాత కాబూల్ యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. సుమారు గంటపాటు సాగిన ఈ మారణహోమంలో 19 మంది విద్యార్థులు చనిపోగా, బుల్లెట్లు తగిలిన మరో 22 మంది పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? -ఎలక్టోరల్ కాలేజ్ వివరాలివే -ఓట్లు నేరుగా వేయరు
ఇరాన్ రాయబారి వచ్చారని..
కాబూల్ యూనివర్సిటీలో జరుగుతోన్న బుక్ ఫెయిర్ ను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు సోమవారం సాయంత్రం (నవంబర్ 2న) దాడికి పాల్పడ్డారు. బుక్ ఫెయిర్ కార్యక్రమానికి అఫ్గానిస్థాన్లో ఇరాన్ రాయబారి వచ్చారనే సమాచారంతో ఆయనను అంతం చేసేందుకే ఫిదాయీలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దొంగచాటుగా వర్సిటీ లోపలికి చొరబడ్డ ముగ్గురు ముష్కరులు.. సుమారు గంటపాటు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఇరాన్ రాయబారి నిజంగానే అక్కడికి వచ్చారనే అధికారిక సమాచారమేదీ వెల్లడికాలేదు.
భయానక దృశ్యాలు..
భారీగా ఆయుధాలు చేతబట్టుకుని ఉగ్రవాదులు బీభత్సం సృష్టించడంతో కాబుల్ వర్సిటీలో భయానక దృశ్యాలు కనిపించాయి. ఎటు చూసినా గోడలపై రక్తపు మరకలు, చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాలు, వాటిపై విద్యార్థుల మృతదేహాలతో ఆ స్థలం భీతావహంగా మారింది. కాల్పుల సమయంలో విద్యార్థులు ఆర్తనాదాలు చేస్తున్న వీడియోలు బయటికి వచ్చాయి. ప్రాణ భయంతో కొంత మంది గోడదూకి పారిపోయే ప్రయత్నం చేశారు.
కిటికీల్లో ఇరుక్కున్న శవాలు..
ఉగ్రదాడిలో చనిపోయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. క్లాస్ రూమ్ కిటికీలను పగుల గొట్టి బయటికి వెళ్లే ప్రయత్నం చేసిన కొందరిని ఉగ్రవాదులు కాల్చి చంపడంతో శవాలు కిటికీల్లోనే ఇరుక్కుపోయి కనిపించాయి. దాడి ఘటన సమాచారం అందుకున్న వెంటనే అఫ్ఘాన్ సైన్యాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదుల ఎదురుకాల్పులు, చీకటి నడుమ రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా సాగుతున్నది.
తాలిబన్ల పనేనా?
కాబుల్ యూనివర్సిటీపై భయానక దాడికి బాధ్యత తమదేనంటూ తాలిబన్లు ప్రకటించారని స్థానిక మీడియా వార్తలు ప్రసారం చేసింది. అమెరికా తన సైన్యాలను వెనక్కి రప్పించేందుకు స్థానిక ప్రభుత్వంతోపాటు తాలిబన్లతోనూ చర్చలు జరుపుతుండటం, చర్చల్లో కొండెక్కిన తాలిబన్లు తాము ఆయుధాలు వదిలేసే ప్రసక్తి లేదని పదే పదే చెబుతుండటం తెలిసిందే. అయితే, కాబుల్ వర్సిటీపై దాడి తమ పని కాదని కాసేపటి కిందటే తాలిబన్ అధికార ప్రతినిధులు ప్రకటించారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.