షాకింగ్: స్టాక్ ఎక్సేంజ్పై ఉగ్రదాడి.. గ్రెనేడ్లు, తుపాకులతో టెర్రరిస్టుల బీభత్సం.. కరాచీలో టెర్రర్
కరోనా మహమ్మారి విజృంభణతో కొద్దిగా నిదానించిన ఉగ్రమూకలు మళ్లీ విశ్వరూపం ప్రదర్శించాయి. కొవిడ్-19, మిడతల దాడితో సతమతమైపోతున్న పాకిస్తాన్ లో టెర్రరిస్టులు మరోసారి బీభత్సం సృష్టించారు. దేశంలోనే అతి పెద్ద నగరం, ఆర్థిక రాజధానిగానూ కొనసాగుతోన్న కరాచీలో దాడులకు తెగబడ్డారు. పాక్ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషించే స్టాక్ ఎక్సేంజ్ భవంతిని టార్గెంట్ గా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
Recommended Video
బిన్ లాడెన్పై భక్తి చాటుకున్న ఇమ్రాన్.. పాకిస్తాన్ పార్లమెంటులో భజన.. అమెరికాపై ఆగ్రహం..
ఆర్థిక రాజధానిలో కల్లోలం..
కరాచీ సిటీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్సేంజ్ దగ్గర సోమవారం ఉగ్రదాడి జరిగింది. అత్యాధునిక తుపాకులు, గ్రెనేడ్లు చేతబట్టుకున్న సాయుధులు స్టాక్ ఎక్సేంజ్ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ముందుగా గ్రెనేడ్లు పేల్చేసి, ఆ తర్వాత జనం బయటికి పరుగులు తీసే సమయంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. విమాన ప్రమాద ఘటన నుంచి తేరుకోకముందే అనూహ్యరీతిలో ఉగ్రదాడి జరగడంతో కరాచీలో కల్లోలం చెలరేగింది.
మరణాలు పెరిగే చాన్స్..
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కరాచీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్సేంజ్ పై టెర్రరిస్టులు జరిపిన దాడిలో ఇప్పటిదాకా 10 మంది చనిపోయారు. దాడి ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు, రక్షణ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. గాయపడ్డ వాళ్లను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది. కాల్పుల నేపథ్యంలో సిటీలోని ఆ ప్రాంతాన్ని దాదాపు షట్ డౌన్ చేశారు.
హై సెక్యూరిటీ జోన్..
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషించే స్టాక్ ఎక్సేంజ్ భవంతి ఉన్న చోటే, ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకుల ముఖ్య కార్యాలయాలు కూడా ఉన్నాయి. గత అనుభవవాల నేపథ్యంలో ఆ ప్రాంతమంతటినీ ఇదివరే హై సెక్యూరిటీ జోన్ గా గుర్తించారు. అడుగడుగునా చెక్ పోస్టులు, సెక్యూరిటీ గార్డులు మోహరించి ఉన్నప్పటికీ టెర్రరిస్టు దాడికి పాల్పడటం గమనార్హం. పోలీసుల వివరణను బట్టి టెర్రరిస్టులు పక్కా పథకం ప్రకారం, ఎవరికీ అనుమానం రాని రీతిలో హై సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశించారు..
కరోలా కారులో రావడంతో..
హై సెక్యూరిటీ జోన్ గా గుర్తింపు పొందిన కరాచీ స్టాక్ ఎక్సేంజ్ బిల్డింగ్ వైపునకు టెర్రరిస్టులు.. వ్యాపారుల మాదిరిగా కారులో వచ్చినట్లు సిటీ పోలీస్ చీఫ్ గులామ్ నబీ మెనన్ తెలిపారు. సిల్వర్ రంగు కరోలా కారులో మొత్తం నలుగురు సాయుధులు ఈ ప్రాంతంలోకి చొరబడ్డారని, ముందుగా గ్రెనేడ్లు విసిరి, ఆ తర్వాత కాల్పులకు తెగబడినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఎక్సేంజ్ బిల్డింగ్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని వివరించారు. దాడి ఘటనపై దర్యాప్తును కూడా ప్రారంభించామన్నారు.
ఆ నలుగురూ ఖతం..
కాగా, స్టాక్ ఎక్సేంజ్ సమీపంలో దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులనూ కాల్చి చంపేసినట్లు సిటీ పోలీస్ చీఫ్ గులాం నబీ మెమన్ మీడియాకు తెలిపారు. దాడికి ముందు టెర్రరిస్టుల కదలికలను బట్టి వాళ్లు నలుగురు మాత్రమే ఉన్నట్లు నిర్ధారించుకున్నామని, ఎదురు కాల్పుల్లో ఆ నలుగురూ చనిపోయారని ఆయన పేర్కొన్నారు. కాగా, చుట్టుపక్కల భవంతుల్లో ఒకరిద్దరు టెర్రరిస్టులు దాక్కొని, పౌరుల్ని బందీలుగా తీసుకున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చినా, పోలీసులు నిర్ధారించలేదు. కరాచీ స్టాక్ ఎక్సేంజ్ పై ఉగ్రదాడిని సింధ్ ఫ్రావిన్స్ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ ఖండించారు.
పీఎం కేర్స్ ఫండ్కు చైనా విరాళాలు.. అందుకే మోదీ నోరెత్తట్లేదన్న కాంగ్రెస్..