కాశ్మీర్ మా బ్లడ్ లోనే ఉంది..చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతాం: పాక్ మాజీ ప్రధాని
ఇస్లామాబాద్: క్రియాశీలక రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, రిటైర్డ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ రెడీ అయ్యారు. దీనికోసం ఆయన అత్యంత సున్నితమైన, సమస్యాత్యకమైన జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఎత్తుకున్నారు. కాశ్మీర్ అనేది తమ రక్తంలోనే ఉందని, దాన్ని ఎవరూ తమ నుంచి వేరు చేయలేరని చెప్పారు. కాశ్మీరీలను ఆదుకోవడానికి ప్రతి పాకిస్తానీయుడు దేనికైనా తెగిస్తారని అన్నారు. తమ దేశ సైన్యం సైతం కాశ్మీర్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పుకొచ్చారు.
రాజకీయాలకు దూరమైన ముషార్రఫ్ ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు. గత ఏడాది అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స కోసం దుబాయ్ కు వెళ్లారు. అక్కడే నివసిస్తున్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని కొద్దిరోజుల కిందటే ప్రకటించారు. రాజకీయాల నుంచి తాను తీసుకున్న విరామం ముగిసిందని, ఇక స్వదేశానికి వెళ్లడమే మిగిలి ఉందని సంకేతాలు ఇచ్చారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఎదురైన కొన్ని చేదు ఫలితాలను భారత్ విస్మరిస్తోందని విమర్శించారు. కార్గిల్ యుద్ధ సమయంలో భారత ప్రభుత్వం అమెరికా సహాయాన్ని అర్థించిందని ఆరోపించారు.
పాకిస్తాన్ వెళ్లడానికి సిద్ధపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్: వచ్చేెనెల ప్రయాణం
ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఏపీఎంఎల్) పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన కాశ్మీర్ విషయంపై స్పందించారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా కట్టబెట్టడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఆ అంశంపై ముషార్రఫ్ నోరు విప్పడం ఇదే తొలిసారి. ఆర్టికల్ 370ని రద్దు చేసినంత మాత్రానా భారత్ పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అన్నారు. కాశ్మీర్ తమ రక్తంలోనే ఉందని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పాకిస్తాన్ నుంచి దాన్ని ఎవరూ వేరు చేయలేరని చెప్పారు. చివరి రక్తం బొట్టు వరకూ పోరాడటానికి ప్రతి పాకిస్తానీయుడు సిద్ధంగా ఉన్నారని ముషార్రఫ్ అన్నారు.
కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి సుహృద్భావ, శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలనే విషయానికి పాకిస్తాన్ కట్టుబడి ఉందని అన్నారు. భారత ప్రభుత్వం దీన్ని భగ్నం చేస్తోందని ఆరోపించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఇందులో భాగమేనని ఉదహరించారు. కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారి వైఖరి వల్లే కాశ్మీర్ అంశం మరింత జటిలమైందని వ్యాఖ్యానించారు. దీన్ని పరిష్కరించడానికి ముందడుగు వేయాల్సిన బాధ్యత కూడా పాకిస్తాన్ మీద కంటే భారత్ పైనే అధికంగా ఉందని చెప్పారు.