యూఎస్ స్కూల్లో కాల్పులు: ఇద్దరు మృతి, 17మందికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాలోని ఓ పాఠశాలలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కెంటకీ రాష్ట్రంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఓ ఆగంతకుడు చొరబడి విద్యార్థులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో 17మంది తీవ్రగాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాఠశాలను చుట్టుముట్టి పారిపోయిందేకు ప్రయత్నించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. నిందితుడ్ని పోలీసులు విచారిస్తున్నారు.
కాగా, 2018లో అమెరికాలో జరిగిన తొలిదాడి ఇదేనని పోలీసులు తెలిపారు. కాల్పుల ధాటికి కొందరు విద్యార్థులు సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీశారని, మరికొందరు వాహనాల్లో దాక్కున్నారని పోలీసులు చెప్పారు.
గాయపడిన విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దాడి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కెంటకీ గవర్నర్ మాట్ బెవిన్.. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.