కిడ్నాప్కు గురైన భారతీయులు - రోడ్డు పక్కన నిర్జీవంగా: 8 నెలల చిన్నారినీ వదల్లేదు..!!
వాషింగ్టన్: అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలో ఇటీవలే అపహరణకు గురైన భారతీయ కుటుంబం నిర్జీవంగా కనిపించింది. కిడ్నాప్కు గురైన నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది నెలల చిన్నారి, ఆమె తల్లిదండ్రులు, సమీప బంధువును గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత హేయంగా హతమార్చారు. ఈ ఘటనకు పాల్పడిందెవరనేది ఇంకా తెలియరాలేదు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోన్నట్లు కాలిఫోర్నియా పోలీస్ కమిషనర్ కార్యాలయం పేర్కొంది.
మృతిచెందిన వారిలో జస్దీప్ సింగ్, జస్లీన్ కౌర్, ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరితో పాటు అమన్దీప్ సింగ్ ఉన్నారు. పంజాబ్లోని హోషియార్పూర్లోని హర్సీ పిండ్ వారి స్వస్థలం. కొన్నేళ్ల కిందటే జస్దీప్ సింగ్ కుటుంబం కాలిఫోర్నియా మెర్సిడ్ కౌంటీలో స్థిరపడింది. మెర్సిడ్ కౌంటీ బ్లాక్ నంబర్ 800, సౌత్ హైవే 59లో జస్దీప్ ఓ షాప్ను నిర్వహిస్తోన్నారు. మూడు రోజుల కిందటే గుర్తు తెలియని వ్యక్తులు ఆ షాప్ నుంచే నలుగురినీ అపహరించారు.
సాధారణంగా సౌత్ హైవే 59 రద్దీతో కూడుకుని ఉన్న ప్రాంతం. ఈ మార్గంలో పెద్ద ఎత్తున రెస్టారెంట్స్, రిటైల్ షాప్స్ ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న బ్లాక్ నంబర్ 800లో జస్దీప్ సింగ్ రిటైల్ షాప్ ఉంది. షాప్కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ నలుగురినీ తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేసినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదు అందిందని మెర్సిడ్ కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది. వారికోసం మెర్సిడ్ కౌంటీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఒకవంక పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. వారి మృతదేహాలు లభించాయి. ఇండియానా రోడ్ అండ్ హచిసన్ రోడ్ పక్కన వాటిని గుర్తించారు. స్థానికులు మృతదేహాలను గుర్తించి మెర్సిడ్ కౌంటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్కు గురైన మరుసటి రోజు హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
అదే రోజున జస్దీప్ సింగ్ ఏటీఎం కార్డ్ను మెర్సిడ్ కౌంటీలోని అట్వాటర్ ప్రాంతంలో వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని మెర్సిడ్ కౌంటీ షెరిఫ్ వెర్న్ వార్న్కే తెలిపారు. ఇదివరకు కాలిఫోర్నియాలో ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. 2019లో తుషార్ ఆత్రే అనే టెక్కీ- తన గర్ల్ఫ్రెండ్ కారులో మృతదేహంగా కనిపించాడు. ఓ డిజిటల్ కంపెనీ ఓనర్ అతణ్ని కిడ్నాప్ చేసినట్లు అప్పట్లో పోలీసులు నిర్ధారించారు.