కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలనం - జీవితంలో తొలిసారి సారీ - అదికూడా బద్ధశత్రువుకు చెప్పాడు
కరడుగట్టిన కర్కోటక నియంత నేతగా పేరుపొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ జీవితంలో తొలిసారి క్షమాపణలు చెప్పారు. అది కూడా తాను బద్దశత్రువుగా భావించే దక్షిణ కొరియాకు, దక్షిణ కొరియా ప్రజలకు కిమ్ క్షమాపణలు చెప్పడం సంచలనంగా మారింది. అయితే, ఈ విషయాన్ని కిమ్ స్వయంగానో లేక ఉత్తర కొరియా అధికారిక మీడియానో కాకుండా దక్షిణకొరియా ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం గమనార్హం.
క్షమాపణ ఎందుకంటే..
ఇటీవల దక్షిణ కొరియాకు ఫిషరీస్ విభాగానికి చెందిన అధికారి ఒకరిని కిమ్ ఆదేశాల మేరకు నార్త్ సైన్యం అతి కిరాతకంగా హత్య చేసింది. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తున్నాడనే నెపంతో సదరు సౌత్ కొరియన్ ను తుపాకితో కాల్చి సముద్రంలో పడేశారు. ఈ చర్యను సౌత్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది. అతనేమీ చొరబాటుదారుడు కాడని, ఓ అధికారిని ఇంత కిరాతకంగా చంపినందుకు ప్రతీకారం తప్పదని కిమ్ దేశాన్ని సౌత్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ కారణంగానే కిమ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
అందుకే చంపేశాం..
తమ జలాల్లోకి ప్రవేశించిన తరువాత సరిహద్దు గస్తీ దళాలు ప్రశ్నించగా.. తాను మత్య్స శాఖ అధికారినన్న విషయాన్ని చెప్పకుండా పారిపోయే ప్రయత్నం చేయడం వల్లే అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని నార్త్ కొరియా వివరణ ఇచ్చిందని, ఆ వివరణతోపాటే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్కు కిమ్ క్షమాపణలతో కూడిన సందేశాన్ని పంపారని అధికారులు తెలిపారు.
చెప్పింది కిమ్ ఒరిజినలేనా?
సదరు అధికారి మృతదేహం కాలిపోయి ఉండటంపైనా నార్త్ కొరియా వివరణ ఇచ్చుకుందని, కరోనా వ్యాప్తి భయంతో ఆ అధికారి వచ్చిన తెప్పను మాత్రమే తగలబెట్టాంకానీ, మృతదేహం జోలికి పోలేదని, ఎన్ కౌంటర్ సమయంలో అన్ని నిబంధనల్ని పాటించామని నార్త్ వివరించినట్లు సౌత్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ లో కిమ్ జాంగ్ చనిపోయారంటూ వార్తలు రావడం, మళ్లీ ఆయన ప్రజల ముందు ప్రత్యక్షం కావడం, ఆ వచ్చిన వ్యక్తి నిజం కిమ్ కాదని, బాడీ డూప్ అని మరికొన్ని కథనాలు రావడం తెలిసిందే. చివరికిప్పుడు కిమ్ తన స్వభావానికి విరుద్ధంగా క్షమాపణలు చప్పడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.