చావు తప్పును సరిదిద్దుకున్న కిమ్ జాంగ్.. మరణంలేని నియంతకు నివాళి.. కుందేళ్లతో కుస్తీ..
కారణం ఏదైనా కావొచ్చు.. కొన్ని సార్లు మనం చేసే చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తరకొరియా నియంతనేత కిమ్ జాంగ్ ఉన్ కూడా తను చేసిన తప్పుకు.. ప్రజలు, ప్రపంచం దృష్టిలో కొన్నాళ్లపాటు చనిపోవాల్సి వచ్చింది. అయితే కిమ్ ఇప్పుడా తప్పును సరిదిద్దుకున్నాడు. రెండున్నర కోట్ల మంది కొరియన్ల గుండెల్లో 'మరణంలేని నేత'గా ముద్రపడిపోయిన తన తాత 'కిమ్ 2 సంగ్' వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాడు. ఇదే తాతగారి జయంతి(ఏప్రిల్ 15) వేడుకలకు గైర్హాజరైన కారణంగానే కిమ్ చనిపోయాడనే వార్తలు పుట్టుకొచ్చాయి.
స్వప్న సురేశ్ వ్యవహారంలో భారీ ట్విస్ట్.. ప్రధాని మోదీ జోక్యం కోరిన సీఎం.. దేశ ప్రతిష్టకు భంగం..
చరిత్రలో అలా జరగలేదు..
రెండవ ప్రపంచ యుద్ధం చివర్లో.. జపాన్ లొంగిపోయిన తరువాత అమెరికా, సోవియెట్ రష్యాలు కొరియాను రెండుగా విభజించడం, దాందో అమెరికా అనుకూల సౌత్ కొరియా, ‘కిమ్ 2 సంగ్' నేతృత్వంలో కమ్యూనిస్ట్ రాజ్యంగా నార్త్ కొరియా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. కాలక్రమంలో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు లోకల్ అంశాలు, వ్యక్తిగత ఆలోచనల్నీ జోడించిన కిమ్ ఎదురులేని నియంతగా ఎదగడం, 1994లో ఆయన చనిపోయేనాటికే ప్రజల దృష్టిలో దేవుడి అవతరాంగా ముద్రపడిపోవడం విదితమే. కిమ్ సంగ్ తర్వాత కొడుకు కిమ్ జాంగ్ ఇల్ దేశాధినేత అయ్యాడు. 2011లో తండ్రి మరణం తర్వాత మన కిమ్ జాంగ్ ఉన్ పగ్గాలు చేపట్టాడు.
ఉన్ ఇన్ బ్లాక్..
తరాలు మారినా.. చరిత్రలో ఏనాడూ ఉత్తరకొరియా పాలకుడిగా ఉన్న వ్యక్తి.. ఆ దేశ నిర్మాత కిమ్ 2 సంగ్ జయంతి, వర్ధంతి వేడుకలను మిస్ చేయలుదు. తాత జయంతి వేడుకకు వెళ్లకుండా మొదటిసారి ఆ తప్పు చేసిన కిమ్.. ఎట్టకేలకు బుధవారం నిర్వహించిన 26వ వర్ధతిలో పాల్గొనడం ద్వారా ప్రాయశ్చిత్తం పొందినట్లయింది. రాజధాని పాంగ్యాంగ్ లో ప్రఖ్యాత కుమ్సుసాన్ ప్యాలెస్ లోని ‘కిమ్ 2 సంగ్' సమాధి వద్ద కిమ్ నివాళులు అర్పించారు. విషాదానికి గుర్తుగా కిమ్ సహా ఆ కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లంతా బ్లాక్ డ్రెస్ ధరించారు. ప్యాలెస్ లోనే కాకుండా, దేశమంతటా విస్తారంగా ఉన్న విగ్రహాల దగ్గర కూడా జనం ప్రార్థనలు చేశారు. పలు రిపోర్టుల ప్రకారం.. కిమ్ 2 సంగ్ ఇంకా బతికే ఉన్నారని, ఆయన మరణం లేని వ్యక్తిఅని ఉత్తరకొరియన్లు బలంగా నమ్ముతారని, ఆమేరకు మైండ్ మ్యాపింగ్ చేయడంతో కిమ్ వంశీకులు సక్సెస్ అయ్యారని వెల్లడైంది.
నో మాస్క్.. కరోనాపై సక్సెస్..
ఉత్తరకొరియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘కిమ్ 2 సంగ్' వర్ధంతి కార్యక్రమంలో కిమ్ సహా ఏ ఒక్కరూ మాస్క్ ధరించకపోవడం గమనార్హం. జనవరి 30 నుంచే దేశవ్యాప్త లాక్ డౌన్, అనుమానితుల్ని క్వారంటైన్ చేయడంతో జులై 1 నాటికి కరోనా వైరస్ పై విజయం సాధించామని కిమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారం నుంచే అక్కడ స్కూళ్లు కూడా రీఓపెన్ అయ్యాయి. అయితే, కొరియాలో అసలు కరోనా కేసులెన్ని? ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? అనే విషయాలు తెలియలేదు. పరిశీలకుల అంచనా ప్రకారం కిమ్ దేశంలో వెయ్యిలోపే కరోనా కేసులు నమోదయ్యాయని, కఠినమైన లాక్ డౌన్ తో వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయగలిగారని వెల్లడైంది.
కరోనా విలయం: కిమ్ దేశంలో ప్రశాంతం.. మహమ్మారిపై ఉత్తర కొరియా ఘనవిజయం.. స్కూళ్లు రీఓపెన్..
ఇంటికి 15 కుందేళ్లు..
గత ఆదివారం ఉత్తరకొరియాలో సైనిక దినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సరికొత్త ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సైనికుడు ఇంట్లో విధిగా కుందేళ్లను పెంచాలని, ఒక్కొక్కఇంట్లో కనీసం 15 కుందేళ్లు ఉండాల్సిందేనని, ఆకస్మిక తనిఖీల్లో లెక్కలు తారుమారైతే తీవ్ర చర్యలు ఉంటాయని ఆ ఆదేశాల సారం. ప్రభుత్వం.. ప్రజలకు సరఫరా చేసే ఆహారంలో మాంసం పాళ్లను పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలోనూ ఇంటికో పందిని తప్పనిసరిగా పెంచాలనే రూల్ విధించారు.
చుక్కల్లో చైనా ఫోన్ల ధరలు..
కరోనా వైరస్ భయాలకుతోడు సౌత్ కొరియా నుంచి కరపత్రాల బెలూన్లు వచ్చిపడుతుండటంతో ఉత్తరకొరియా సరిహద్దు అంతటా బలగాలను భారీగా మోహరించారు. నెల రోజుల ఉద్రిక్తత తర్వాత సౌత్ కొరియాపై సైనిక చర్యను ఉపసంహరించుకుంటున్నట్లు కిమ్ ప్రకటించడంతో పరిస్థితి సర్దుమణిగింది. అయితే, నార్త్ లో ఏం జరుగుతోందనే ఇన్ఫర్మేషన్ బయటికి పొక్కుతుండటంతో వేగుల కదలికలపై సైన్యం నిఘా పెంచింది. అందులో భాగంగా సరిహద్దులో మళ్లీ సెక్యూరిటీ టైట్ చేసింది. ఈ పరిణామంతో స్మగ్లర్లు, ఫిరాయింపుదారులకు కంచె దాటే అవకాశం లేకుండా పోయిందని, దీంతో నార్త్ లోపల.. చైనా ఫోన్ల ధరలు చుక్కలనంటే స్థాయికి పెరిగాయని ‘డైలీ ఎన్కే' మీడియా తెలిపింది.