కిమ్ జాంగ్ ‘మరణం’ వెనుక రహస్యమిదే.. ‘ఫేక్ టెక్నిక్’తో ద్రోహుల గుర్తింపు.. ఉ.కొరియాలో బీభత్సమే..
'అనగనగా ఒక రాజ్యం.. అందులో అంతర్గత సంక్షోభం.. ఆ సమయంలోనే వేటకెళ్లిన రాజు తిరిగిరాడు.. అప్పటికే పీఠంపై కన్నేసిన కొందరు.. శతృదేశాలతో కలిసి కుట్రలకు తెరలేపుతారు.. అంతలోనే చనిపోయాడనుకున్న రాజుగారు సడెన్గా ప్రత్యక్షమై ద్రోహుల ఆట కట్టిస్తాడు..' సిల్లీగా అనిపించినా, ఇలాంటి చందమామ కథల్లోనే ఎత్తుగడల్నే నియంతలు కూడా ఫాలో అవుతుంటారు. అప్పటి అడాల్ఫ్ హిట్లర్ నుంచి మొన్నటి సద్దాం హుస్సేన్ దాకా కరడు గట్టిన నియంతలందరూ తమను పోలిన డూప్లను వాడుకోవడం, ఫేక్ మరణవార్తల్ని ప్రచారం చేయించడం తద్వారా లోపలి శత్రువుల్ని గుర్తించి చంపిపారేసిన సంఘటనలు చరిత్రలో చాలానే ఉన్నాయి. ఆధునిక నియంత కిమ్ జాంగ్ ఉన్ అందుకు అతీతుడేమీకాదు.
Recommended Video
తనను తానే చంపుకున్నాడు..
ఐక్యరాజ్యసమితి వారించినా, అమెరికా హెచ్చరించినా వినకుండా వరుసగా అణ్వాయుధాల పరీక్షలు చేయడంతో ఉత్తరకొరియా వెలికి గురైంది. అంతర్జాతీయంగా విధించిన ఆంక్షల కారణంగా కిమ్ దేశం చితికిపోయింది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత చైనా నుంచి అందే కాస్తో కూస్తో సాయం కూడా నిలిచిపోయింది. వ్యవస్థలన్నీ కుప్పకూలే స్థితిలో కిమ్ జాంగ్ ఒక ఫెల్యూర్ లీడరనే ప్రచారం ఉధృతమైందని, ప్రజల్లో ఆయనకున్న పాపులారిటీని దిగజార్చే ప్రయత్నం జరిగిందని, వాటికి చెక్ పెడుతూ, తనపై కుట్రలు పన్నిన ద్రోహులెవరో కనిపెట్టడానికే కిమ్ అజ్ఞాతంలోకి వెళ్ళి.. తన మరణాన్ని తానే ప్రచారంలోకి తెచ్చాడని తాజా రిపోర్టుల్లో తేలింది.
ఫలించిన ఫేక్ ప్రచారం..
కిమ్ జాంగ్ తన మరణంపై తానే పుట్టించిన ఫేక్ వార్తలు అనుకున్నదానికంటే బాగా వ్యాప్తి చెందాయని, ఒకరిద్దరు ఆంతరంగికులకు తప్ప కిమ్ ఏమైపోయాడన్న జాడ నిజంగానే ఎవరికీ తెలియలేదని, దీంతో కిమ్ వారసుడి ఎంపిక కోసం ప్యోంగ్యాగ్ సిద్ధమైందని, అతని సోదరి కిమ్ యో జాంగ్ కు పగ్గాలు కట్టబెట్టేందుకు వర్కర్స్ పార్టీ ముఖ్యులు ప్రయత్నించారని, ఇదంతా ద్రోహుల్ని కనిపెట్టేందుకు కిమ్ ఆడిన నాటకమంటూ ‘స్కై న్యూస్ ఆస్ట్రేలియా' కొన్ని ఆధారాలతో రిపోర్టు ప్రచురించింది. గతంలో రష్యా నియంత నేత జోసెఫ్ స్టాలిన్ కూడా ఇదే తరహా టెక్నిక్ వాడారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
ఇక నెత్తుటి ప్రవాహమే..
మామూలుగానే కిమ్ జాంగ్ చాలా కోపిష్టని, ఏ చిన్న తప్పు జరిగినా అధికారులు, సిబ్బందిని నిలబెట్టి కాల్చిపారేసే క్రూరుడని పేరుంది. అలాంటిది, దేశం ఆర్థిక మాంద్యంలో ఉండగా తన సీటుకే ఎసరుపెట్టాలని చూసినవాళ్లను ఆయన ఈజీగా క్షమించబోరని, గడిచిన 20 రోజుల్లో ఎవరెవరు ఏమేం కుట్రలు పన్నారో కిమ్ రిపోర్టులు తెప్పించుకున్నారని, రాబోయే రోజుల్లో అక్కడ నెత్తుటి ప్రవాహం తప్పేలా లేదని ‘స్కై న్యూస్ ఆస్ట్రేలియా' రిపోర్టులో రాసుకొచ్చారు. కిమ్ ఫేక్ మరణం సొంతదేశంలోనే కాదు, విదేశాల్లోని శత్రువుల్ని కూడా కోలుకోలేని దెబ్బ తీసింది..
ఇరకాటంలో ఆ ఇద్దరు..
ఒకప్పుడు కిమ్ జాంగ్ ఆంతరంగికులుగా ఉండి, వర్కర్స్ పార్టీలో ప్రముఖ నేతలుగా కొనసాగి, విభేధాల కారణంగా అక్కణ్నుంచి పారిపోయి సౌత్ కొరియాలో ఆశ్రయం పొందిన ఇద్దరు ప్రముఖుల పరిస్థితి దీనంగా తయారైంది. వారిలో ఒకరు ఉ.కొరియా మాజీ రాయబారి తాయ్ యాంగ్ హో కాగా, రెండో వ్యక్తి జీ షెయాంగ్ హో. ప్రస్తుతం సౌత్ కొరియా జాతీయ అసెంబ్లీ సభ్యులుగానూ కొనసాగుతోన్న వీళ్లిద్దరూ.. నార్త్ కొరియా విముక్తి కోసం పాటుపడుతున్నారు. ఈ క్రమంలో కిమ్ గురించే వాళ్లు చెప్పే చిన్న విషయాలకు కూడా ప్రాధాన్యం ఉండేది. ఇటీవల కిమ్ మరణాన్ని వీళ్లిద్దరూ ధృవీకరించారు. కానీ నియంత నేత మళ్లీ జనం ముందు ప్రత్యక్షం కావడంతో తాయ్, షెయాంగ్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పారు. వీళ్లద్దరి వ్యవహార శైలిపై సౌత్ కొరియా అధికార పార్టీలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మీడియా కూడా ఆ ఇద్దరు చెప్పే విషయాలను ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఆ విధంగా కిమ్ పక్కదేశంలోని తన శతృవుల నోళ్లు సైతం మూసేయించాడు.
కిమ్కు రష్యా పురస్కారం..
కరోనా వార్తలక ధీటుగా కిమ్ సైతం హాట్ టాపిక్ గా కొనసాగుతోన్నవేళ మరో అరుదైన సంఘటన జరిగింది. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్.. ఉత్తరకొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ను వార్ మెడల్ తో సన్మానించారు. మంగళవారం ప్యోంగ్యాంగ్ లోని రష్యా ఎంబసీలో జరిగిన కార్యక్రమంలో రెండు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కిమ్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సుమారు 1500 మంది రష్యన్ సైనికులు కొరియా గడ్డపై చనిపోతారు. వాళ్లకు సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహించి, వాళ్ల వస్తువుల్ని ప్రిజర్వ్ చేసినందుకుగానూ ఉత్తరకొరియాకు రష్యా ఈ అవార్డును ప్రదానం చేసింది.