మా అన్న రమ్మంటున్నారు: ద.కొరియా అధ్యక్షుడికి కిమ్ సోదరి ఆహ్వానం
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షులు మూన్ జే ఇన్ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ ఆహ్వానించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో జరగనున్న సదస్సుకు హాజరు కావాలని మూన్ను కోరారు.
ఉత్తర కొరియా విదేశాంగ మంత్రితో కలిసి కిమ్ సోదరి యో జాంగ్ దక్షిణ కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కిమ్ పంపిన ఆహ్వానం లేఖను దక్షిణ కొరియా అధ్యక్షులకు అందించారు.
దక్షిణ కొరియా అధ్యక్షులు సదస్సుకు వెళ్తారా
కిమ్ జాంగ్ ఉన్ ఆహ్వానించినప్పటికీ దక్షిణ కొరియా అధ్యక్షులు మూన్ సదస్సుకు వెళ్తారా లేదా అనే విషయం తెలియరాలేదు. దీనిపై ఆయన స్పందించలేదు. సదస్సుకు వెళ్తానా, లేదా అన్న విషయమై ఆయన మాట్లాడలేదు.
ట్రంప్ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందా
అమెరికాకు మిత్ర దేశమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు వెళ్తారా అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ వెళ్తే మూన్ జే ఇన్ అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
అధికారంలోకి వచ్చాక నేతలను కలవని కిమ్ జాంగ్ ఉన్
ఈ ఆహ్వానం ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అగ్రనేతల మధ్య భేటీకి ఆస్కారం లేకపోలేదని అంటున్నారు. ఇది సఫలమైతే చాలా ఏళ్ల తర్వాత భేటీ అవుతున్నట్లుగా చెప్పవచ్చు. 2011లో కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రపంచంలోని ఏ పెద్ద నేతను కూడా ఆయన కలవలేదు.
పసందైన విందు
ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విషయం తెలిసిందే. కిమ్ సోదరి వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో దక్షిణ కొరియాలో పర్యటించారు. దక్షిణ కొరియా అధ్యక్షులు ఆమెకు, ఉత్తర కొరియా బృందానికి తన అధికారిక నివాసంలో పసందైన విందు ఏర్పాటు చేశారు.
కిమ్ సందేశం పంపించారా
వింటర్ ఒలింపిక్స్ ప్రతినిధిగా దేశం తరఫున సోదరిని దక్షిణ కొరియాకు పంపిన కిమ్ జాంగ్ ఉన్, వింటర్ ఒలింపిక్స్ టీమ్ మేనేజర్గా తన ప్రేయసిని పంపించారు. దీంతో అతను దక్షిణ కొరియాకు సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నామనే సందేశం పంపించారని అంటున్నారు.