కిమ్ జాంగ్ రివర్స్ రణనీతి.. శత్రువు ఆయుధాలతోనే ఎదురుదాడి.. సౌత్పైకి బెలూన్ బాంబులు..
నిత్యం ఆటంబాబులతో ఆటాడుకునే ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు రూటు మార్చాడు. శత్రువులు తనపై విసిరిన ఆయుధాలతోనే తిరిగి ఎదురుదాడి మొదలుపెట్టాడు. న్యూటన్ మూడో గమన సూత్రాన్ని ఉటంకిస్తూ.. తన జోలికొస్తే ఉత్పాతం తప్పదంటూ పొరుగుదేశానికి హెచ్చరికలు పంపాడు. నార్త్ కొరియా అధికారిక మీడియా ''కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ)'' ఈ మేరకు కిమ్ తాజా ఆదేశాలను ప్రపంచానికి వెల్లడించింది.
Recommended Video
ఇక చైనా ఖేల్ ఖతం.. త్రివిధ దళాలకు సంచలన ఆదేశాలు.. డ్రాగన్ తోకజాడిస్తే కత్తిరించాలంటూ..
బెలూన్ బాంబులు..
నియంత కిమ్ జాంగ్ చేతిలో నార్త్ కొరియా ప్రజలు నలిగిపోతున్నారని, అణ్వాయుధాలతో ఆయన ప్రపంచాన్ని నాశనం చేయకముందే ప్రజలు తిరగబడాలని రాసున్న లక్షలాది కరపత్రాలు నార్త్ భూభాగంలోకి వచ్చిపడుతున్నాయి. సౌత్ కొరియా బార్డర్ మీదుగా ‘‘ఫ్రీ నార్త్ కొరియా'' ఉద్యమకారులు బెలూన్ల ద్వారా ఆ కరపత్రాలను నార్త్ వైపునకు పంపుతున్నారు. రెండు వారాలుగా కొనసాగుతోన్న ఈ బెలూన్ల వ్యవహారాన్ని నార్త్ కొరియా సీరియస్ గా తీసుకుంది. బెలూన్ల ద్వారా కరపత్రాలు పంపడం ఆపకుంటే సైనిక చర్యకు దిగుతామంటూ కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ సౌత్ కొరియా ప్రభుత్వాన్ని ఇదివరకే హెచ్చరిచింది. అయినా సరే బెలూన్ల రాక ఆగకపోవడంతో కిమ్ రివర్స్ స్ట్రాటజీ ఎత్తుకున్నారు..
ఎదురు దాడికి సిద్ధం..
సౌత్ కొరియా సర్కారు అండతో నార్త్ ఫిరాయింపుదారులు తమ బెలూన్ కరపత్రాల్లో ఏవైతే ఆరోపణలు చేశారో.. వాటికి దీటుగా బదులిస్తూ.. ఈ బెలూన్ల ఎగరవేతను ఆపకుంటే ఎలాంటి ఉత్పాతాలు తలెత్తుతాయో హెచ్చరిస్తూ కిమ్ సర్కారు కూడా లక్షల కొద్దీ కరపత్రాలను తయారు చేసింది. సౌత్ కొరియాలోని శత్రువులు ఎలాగైతే ఇటువైపునకు బెలూన్లు ఎగరేశారో.. అదే రీతిలో నార్త్ నుంచి సౌత్ లోకి కరపత్రాల బెలూన్లను పంపేందుకు కిమ్ ఆదేశాలు జారీచేశారు. బోర్డర్ వెంబడి అన్ని పట్టణాల్లో ముద్రించిన కరపత్రాలను బెలూన్లలో నింపే ప్రక్రియ కొనసాగుతున్నది. తద్వారా శత్రువు ఆయుధాలతోనే కిమ్ ఎదురుదాడికి సిద్ధమయ్యారు.
చర్యకు ప్రతి చర్య..
‘‘అనుభవిస్తేగానీ ఎదుటివాడి బాధేంటో ఎవరికైనా అర్థంకాబోదు. ఒక చర్యకు సమాన స్థాయిలో ప్రతి చర్య ఉంటుందని మీరు గ్రహించాలి. మా జోలికొస్తే ఏమవుతుందో ఈ కరపత్రాల్లో చదువుకోండి. అయినాసరే పెట్టుకుంటామంటే ఎంత దూరమైనా వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం'' అని రాసున్న కరపత్రాలపై సౌత్ కొరియా ప్రెసిడెంట్ మూన్ జే ఇన్ ను అవమానించే రీతిలో ఫొటోలను ముద్రించారు. నార్త్ ఫిరాయింపుదారుల్లో కొందరు ప్రముఖుల ఫొటోలను, రాబోయే రోజుల్లో వాళ్లు ఎదుర్కొనే శిక్షలను సైతం కరపత్రాల్లో రాసుకొచ్చారు. వీటిని బెలూన్ల ద్వారా సౌత్ కొరియాలోకి పంపనున్నారు.
బిల్డింగ్ పేల్చివేత నిజమే..
కరపత్రాల బెలూన్ల విషయంలో గతంలో హెచ్చరించినట్లే సౌత్ కొరియాపై నార్త్ కొరియా దాడికి పాల్పడిందని, రెండు దేశాల మధ్య ఉన్న డీమిలిటరైజ్డ్ జోన్(డీఎంజెడ్)లో కీలకమైన బిల్డింగ్స్ ను పేల్చేయడమే టార్గెట్ గా కిమ్ జాంగ్ కాల్పులు చేయించాడని, నాటి ఘటనలో పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా సైతం ధృవీకరించింది. కాగా, ఎన్నడూ లేనిది కరపత్రాల బెలూన్లను పంపాలని నార్త్ కొరియా నిర్ణయించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. కిమ్ జాంగ్ నిజంగానే చనిపోయాడని, ఇప్పుడున్నది ఆయన బాడీ డూప్ అని, పరిపాలనా వ్యవహారాలను సొదరి కిమ్ యో జాంగ్ చూసుకుంటున్నారని, బెలూన్లను పంపాలన్న ఐడియా కూడా ఆమెదే అయిఉండొచ్చని నార్త్ పరీశీలకులు కొందరు అభిప్రాయపడ్డారు.
సైన్యంలో భారీ అవినీతి..
నార్త్ కొరియా సైన్యానికి వస్తువులు చేరవేసే ట్రక్కు డ్రైవర్లు.. సైనిక సిబ్బందికి భారీ ఎత్తున ముడుపులు సమర్పించుకుంటున్నారని, ఆ క్రమంలో వస్తువుల అక్రమ రవాణా సైతం చోటుచేసుకుందని తాజా సోదాల్లో బయటపడటం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై దృష్టిసారించిన కిమ్.. ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్స్ నిర్వహించారని, అవినీతికి పాల్పడిన సిబ్బంది, ట్రక్కు డ్రైవర్లను గుర్తించి, వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు తెలిసింది.
షాకింగ్:బందీలుగా చిక్కిన చైనా సైనికులు.. 40మంది హతమయ్యారన్న కేంద్ర మంత్రి..