తొలిసారి మీడియా ముందుకు కిమ్ జోంగ్ ఉన్ సతీమణి: ఆమె అజ్ఞాతంపై అనేక ప్రచారాలు!
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియాలో వింతలే జరుగుతాయి. లేదంటే ఉత్తరకొరియాలో జరిగినదే వింత అవుతుంది. ఎందుకంటే, ఇదంతా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కారణంగానే. సాధారణ దేశాధ్యక్షుల మాదిరిగా ఆయన వ్యవహారాలుండవు. తనదేశంలో తాను చెప్పిందే శాసనం అన్నట్లు ఉంటుంది. గతంలో కొద్ది నెలలపాటు కిమ్ జోంగ్ ఉన్ అజ్ఞాతంలో ఉండగా, ఇటీవలే మళ్లీ ప్రత్యక్షమయ్యారు.
ఏడాది తర్వాత తొలిసారి మీడియా ముందుకు కిమ్ సతీమణి
కిమ్ సోదరి, భార్య కూడా మీడియా ముందుకు ఎప్పుడొస్తారో తెలియదు. కానీ, ఏడాది తర్వాత కిమ్ జోంగ్ ఉన్ సతీమణి రీ సోల్ జు మీడియా కంటికి చిక్కారు. తన భర్త కిమ్తో కలిసి మామ దివంగత కిమ్ జోంగ్ ఇల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కిమ్ దంపతులకు సభికులంతా ఘన స్వాగతం పలికారు.
మాస్కులు లేకుండానే..
మేన్సుడే ఆర్ట్ థియేటర్లో జరిగిన ఈ జయంతి వేడుకల్లో కిమ్ దంపతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేగాక, ఈ కార్యక్రమంలో కిమ్ దంపతులతోపాటు ఎవరూ కూడా మాస్కులు ధరించకపోవడం గమనార్హం. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందే కిమ్ ది కుమ్సాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్లో తన తండ్రి, తాతల సమాధులను దర్శించుకున్నారు.
తాతా తర్వాత ‘ప్రెసిడెంట్' కిమ్..
ఈ కార్యక్రమాలను రిపోర్టు చేసిన ఉత్తరకొరియా మీడియా కిమ్ను అధ్యక్షుడిగా సంబోధించడం విశేషం. వాస్తవానికి ఉత్తరకొరియా అధినేతను ఛైర్మన్ అని సంబోధిస్తారు. కానీ, గత రెండు వారాలుగా ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్స్ ఇదే విధంగా పేర్కొనడం గమనార్హం. అయితే, 'ప్రెసిడెంట్(అధ్యక్షుడు)' అనే పదాన్ని ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు దేశ వ్యవస్థాపకుడైన కిమ్-II సంగ్కు మాత్రమే వినియోగించారు. కిమ్కు ఆయన తాత అవుతారు.
ఏడాదిగా కిమ్ సతీమణి అజ్ఞాతంలో ఏం చేశారు?
కాగా, గతంలో కిమ్ తోపాటు రీ సోల్ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గత జనవరి తర్వాత ఆమె బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, మరో బిడ్డకు జన్మనివ్వనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, కరోనా కారణంగానే ఆమె బాహ్య ప్రపంచం ముందుకు రావడానికి ఇష్టపడలేదని దక్షిణ కొరియా ఇంటెలీజెన్స్ ఏజెన్సీ నివేదికలు పేర్కొన్నారు.
ఉత్తరకొరియాలో కరోనా కేసులు లేవని చెబుతున్నప్పటికీ.. అందులో నిజం లేదని దక్షిణకొరియా, జపాన్లు పేర్కొంటున్నాయి. కిమ్-రీ సోల్ ల వివాహం 2009లో జరుగగా, వారికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. గతంలో చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా కిమ్ దంపతులు పాల్గొనడం గమనార్హం.