మోడీ ముందుతేలిపోయిన బ్యూటీ కిమ్ కర్దాషియన్!
మెల్బోర్న్: గ్లోబల్ గ్లామర్ క్వీన్గా పేరుగాంచిన అమెరికా ముద్దుగుమ్మ కిమ్ కర్దాషియన్ కంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే ఆస్ట్రేలియా మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో బ్యూటీ క్వీన్ కిమ్ కర్దాషియన్ కూడా ఆస్ట్రేలియాలో పర్యటించారు.
అయితే, మోడీ పర్యటనకు ఆస్ట్రేలియా మీడియా అత్యంత ప్రాధాన్యమిచ్చింది. పర్యటనలో భాగంగా ఆయన పాల్గొన్న కార్యక్రమాల వివరాలను పత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయి. అటు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మోడీ పర్యటనను కవర్ చేసింది. దీంతో, ఆస్ట్రేలియా వ్యాప్తంగా మోడీ చర్చనీయాంశం అయ్యారు.
కిమ్ కర్దాషియన్ ఓ వైపు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా.. ఆమె కంటే మోడీకే ఆసీస్ మీడియా కవరేజ్ ఇచ్చింది. ఆహార్యం మొదలు.. ఉపన్యసించే తీరు, హావభావాలు, భావాల్లో స్పష్టత, భావ తీవ్రత, ముఖ్యంగా ఆయన హాస్య చతురత తదితర అంశాలు ఆస్ట్రేలియన్లను బాగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ నిలిచారు. ఈ చారిత్రక సందర్భాన్ని ఆస్ట్రేలియా అధికారిక వార్తా చానల్ ఏబీసీ లైవ్ టెలికాస్ట్ చేసింది.
కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో మోడీ ఆ దేశ ప్రధాన మంత్రి టోనీ అబాట్కు అరుదైన కానుక ఇచ్చిన విషయం తెలిసిందే. కాన్బెర్రాలో ఇరువును ప్రధానుల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల ముందు మోడీ కానుక అందజేశారు. భారత్లో స్థిరపడిని ఆస్ట్రేలియా న్యాయవాది జాన్ లాంగ్ 1857లో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి తరఫున ఈస్టిండియా కంపెనీ కోర్టులో వేసిన పిటిషన్ కాపీని మోడీ ఆస్ట్రేలియా ప్రధానికి బహూకరించారు.
ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మీడియాకు వెల్లడించారు. భారత్లో జాన్ అద్బుత ప్రయాణాన్ని ప్రతిబింబించే మరో బహుమతిని టోనీకి అందజేశారు.
ఆస్ట్రేలియాకు చెందిన లాయన్ జాన్ లాంగ్ 1842లో భారత్ వచ్చి స్థిరపడ్డారు. ఆయన ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు. ఓ పత్రికను సైతం నడిపారు. తరువాత ఝాన్సీ లక్ష్మీబాయికి సలహాదారుగా సేవలందించారని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. మీరట్ నుంచి 1845లో ‘ద మఫిసిలైట్' అన్న పత్రికను ప్రారంభించిన జాన్ తరువాత ముస్సోరీ నుంచి తీసుకొచ్చారు.