యుద్ధం తప్పదా?: ఆంక్షలు అతిక్రమిస్తూ ఉత్తరకొరియా... డేగకన్నేసిన అమెరికా! ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు..
వాషింగ్టన్: కయ్యాలమారి ఉత్తరకొరియాలో ఏ మార్పూ రాలేదు. అమెరికా హూంకరించినా, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినా దాని స్వభావంలో, తీరులో కించిత్ మార్పు కూడా కానరావడం లేదు. మిత్రదేశాలైన చైనా, రష్యాల మాట ఎప్పుడో వినడం మానేసింది.
తనపై ఐరాస విధించిన ఆంక్షలను తోసిరాజంటూ తన దేశంలో అధికంగా లభ్యమయ్యే బొగ్గును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది ఉత్తరకొరియా. అంతేకాదు, సిరియాతో కలిసి బాలిస్టిక్ క్షిపణులు, మయన్మార్తో కలిసి రసాయన ఆయుధాలను కూడా తయారు చేస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికాపై వచ్చే 30 రోజుల్లో ఉత్తరకొరియా దాడికి పాల్పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ అమెరికా నిఘా సంస్థ సీఐఏ చీఫ్ మైక్ పోంపియో తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి.
మారని ఉత్తరకొరియా...
ఉత్తరకొరియా ‘కుక్క తోక వంకరే' అన్న చందంగా ప్రవర్తిస్తోంది. వరుస క్షిపణి పరీక్షలు జరుపుతూ ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేసినా కూడా అగ్రరాజ్యం అమెరికా మాటలకే పరిమితమైంది తప్ప ఇప్పటి వరకు చేతలకు దిగలేదు. అదే అదనుగా ఉత్తరకొరియా తన అణుశక్తి పాటవాన్ని కూడా శరవేగంగా పెంచుకుంది. ఒక్క 2017 సంవత్సరంలోనే ఏకంగా 20 న్యూక్లియర్ మిసైళ్లను పరిశీలించిందంటే.. ఉత్తరకొరియా దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేతినిండా అణ్వాస్త్రాలను ఉంచుకున్న ఉత్తరకొరియా అగ్రరాజ్యం అమెరికాకే వార్నింగ్లు ఇవ్వడం మాత్రమే కాదు.. ఏ క్షణంలోనైనా అణుదాడికి దిగవచ్చని అమెరికా నిఘా సంస్థ సీఐఏ అధినేత మైక్ పోంపియో అంచనా.
ఐక్యరాజ్యసమితి ఆంక్షలను అతిక్రమిస్తూ...
ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలకు అడ్డుకట్ట వేయాలని భావించి ఆ దేశంపై ఆంక్షలు విధించిన ఐక్యరాజ్యసమితి, ఈ విషయంలో కీలకపాత్ర పోషించిన అమెరికా కూడా మరోకంట ఉత్తరకొరియాను గమనిస్తూనే ఉన్నాయి. ఉత్తరకొరియాలో బొగ్గు, ఇనుము, స్టీల్ లాంటి ఉత్పత్తులు అధికంగా లభ్యమవుతాయి. ఆ దేశానికి విదేశీ మారకద్రవ్యం కూడా ఎక్కువగా వీటి ఎగుమతులపైనే లభిస్తుంటుంది. ఇది గమనించే ఆ దేశం నుంచి బొగ్గు, ఇనుము, స్టీల్ ఇతర దేశాలకు ఎగుమతి చేయరాదంటూ ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆదేశాలను ఉత్తరకొరియా ఏమాత్రం పట్టించుకోలేదు. గతేడాది జనవరి-సెప్టెంబరు మధ్య ఉత్తరకొరియా బొగ్గు, ఇనుము, స్టీల్ ఎగుమతి చేసి 200 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది. సముద్ర మార్గం ద్వారా తన దేశం నుంచి బొగ్గు ఉత్పత్తులను చైనా, మలేసియా, దక్షిణకొరియా, రష్యా, వియత్నాం దేశాలకు ఎగుమతి చేసింది.
కిమ్ చేసిన ఆ ప్రకటన బూటకమేనా?
ఉత్తరకొరియా అధినేత కిమ్ ఈ మధ్యన ఓ ప్రకటన చేశారు. ఉభయకొరియాలు కలిసిపోవాలని ఆకాంక్షించారు. అంతేకాదు, దక్షిణ కొరియాలో శీతాకాలపు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తన దేశంనుంచి క్రీడాకారులనే కాకుండా కొంతమంది ఛీర్ లీడర్స్ను కూడా పంపించారు. అంతేకాదు, ఈ క్రీడల ప్రారంభోత్సవంలో జరిగే మార్చ్ఫాస్ట్లో కూడా దక్షిణ కొరియా క్రీడాకారులతో కలిసి తమ దేశ పతాకం చేతబూని తమ దేశ క్రీడాకారులు కూడా మార్చ్ఫాస్ట్ చేస్తారంటూ ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా ఉత్తరకొరియాలో వచ్చిన మార్పుకు సంకేతాలని దక్షిణ కొరియాతోపాటు ప్రపంచ దేశాలన్నీ కూడా భావించాయి. అయినా అమెరికా మాత్రం నోరువిప్పలేదు. ఏదో అనుమానం. నియంత కిమ్లో నిజంగా మార్పు వచ్చిందా? లేక ఇవన్నీ అతడి ఎత్తుగడలా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనసులో బోలెడు అనుమానాలు.
అటు సుహృద్భావన... ఇటు బలప్రదర్శన!
ఒకవైపు తన దేశ క్రీడాకారులను దక్షిణకొరియాలో ఒలింపిక్స్కు పంపుతూనే మరోవైపు దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లో బల ప్రదర్శన ఏర్పాట్లు చేయమంటూ మిలిటరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ఉత్తరకొరియాలో సైన్యం వార్షికోత్సవాలను నిర్వహించడం పరిపాటి. ఈ వార్షికోత్సవాల సందర్భంగా రాజధాని ప్యాంగ్యాంగ్లో భారీ ఎత్తున మిలిటరీ పరేడ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఉత్తరకొరియా సైన్యం తన 70వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోనుంది. అయితే దేశాధినేత కిమ్ ఉన్నట్లుండి ఈ సైన్యం వార్షికోత్సవం తేదీని మార్చిపారేశారు. ఫిబ్రవరి 8న పెద్ద ఎత్తున మిలిటరీ పరేడ్ జరపమంటూ తన దేశ మిలిటరీ అధికారులను ఆదేశించారు. ఇది దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందు కావడం యాదృచ్ఛికమా? లేక లిటిల్ రాకెట్మ్యాన్ ఏదైనా ఎత్తుగడ వేస్తున్నాడా? అమెరికా మనసులో కదలాడుతున్న అనుమానాలివి.
చైనా, రష్యాలకు అమెరికా హెచ్చరికలు...
ఉత్తరకొరియాకు మిత్రదేశాలు చైనా, రష్యాలే. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్కు తాము ఎంతో చెప్పిచూశామని, అతడు తమ మాట కూడా వినడం లేదని పైకి ఆ రెండు దేశాలు ఎంత నీతులు చెబుతున్నా.. నిజానికి ఉత్తరకొరియాను కట్టడి చేయగలిగేవి ఆ దేశాలే. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కూడా బాగా తెలుసు. అందుకే ఆయన ఉత్తరకొరియా దూకుడు విషయంలో ఈ రెండు దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, దాని మిత్ర దేశాలపై ఉత్తర కొరియా ఎలాంటి అణుదాడికి పాల్పడినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, కిమ్ పాలనకు ముగింపు తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ఒక్క ఉత్తరకొరియా మాత్రమే కాదు, అటు యూరోప్లో రష్యాగాని, ఇటు ఆసియాలో చైనాగాని ఎలాంటి అణ్వాయుధ దాడులు జరిపినా అమెరికా చేతులు ముడుచుకుని చూస్తూ ఊరుకోబోదని... రష్యా, చైనా కూడా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని ఆయన కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ అణుశక్తిపైనా శంక...
మరోవైపు 21 శతాబ్దంలో అణు తీవ్రవాదం అత్యంత ప్రమాదకరమైనదంటూ అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ అధికారి షానన్ కూడా వ్యాఖ్యానించారు. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రవాదానికి ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు కురిపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అణ్వాయుధాలను రూపొందించే సత్తా ఉన్నప్పటికీ వాటి నిర్వహణ పాకిస్తాన్ వల్ల కాదని, ఒకవేళ పాకిస్తాన్ తయారు చేసిన అణ్వాయుధాలు ఆ దేశంలోనే తీవ్రవాద సంస్థల చేతిలో పడితే ప్రపంచానికి పెను ప్రమాదమేనని ట్రంప్ ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వాదనను పాకిస్తాన్ పాలకులు కొట్టిపారేశారు. తమకు అణ్వాయుధాలు తయారు చేయడమేకాదని, వాటి నిర్వహణ కూడా చేతనవుతుందని, ఈ విషయంలో అమెరికా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
మరో 30 రోజుల్లో యుద్ధం వస్తుందా?
అమెరికాపై వచ్చే 30 రోజుల్లో ఉత్తరకొరియా దాడికి పాల్పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ అమెరికా నిఘా సంస్థ సీఐఏ చీఫ్ మైక్ పోంపియో తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో జరిగే ప్రతి అంశాన్ని అత్యంత జాగరూకతతో గమనిస్తున్నట్లు మైక్ పేర్కొన్నారు. ఇప్పటికే తన దగ్గరున్న బాలిస్టిక్ మిస్సైల్స్తో ఉత్తరకొరియా దాడి చేయొచ్చునని, ఎలాంటి పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా రక్షణ వర్గాలు సంసిద్ధంగా ఉన్నాయని ఆయన ప్రకటించారు. అంతేకాదు, యుద్ధ పిపాసిగా మారిన ఉత్తరకొరియా నియంత కిమ్.. సిరియాతో కలిసి బాలిస్టిక్ క్షిపణులు, మయన్మార్తో కలిసి రసాయన ఆయుధాలను కూడా తయారుచేస్తున్నట్లు కొన్ని సాక్ష్యాలు లభించాయని చెప్పారు. అందుకే ప్రపంచానికే శత్రువుగా మారిన కిమ్ జాంగ్ ఉన్ను తుదముట్టించేందుకు కూడా అమెరికా ప్రయత్నాలు చేస్తోందని కూడా మైక్ పోంపియో స్పష్టం చేశారు.