సౌదీ రాజు సల్మాన్ కీలక నిర్ణయం: లాక్డౌన్లో వారికి భారీ ఊరట..ఎందుకో తెలుసా..?
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ రాజు సల్మాన్ ఒక ఊరటనిచ్చే ప్రకటన చేశారు. లాక్డౌన్ సమయం కంటే ముందు సౌదీకి వచ్చి అక్కడే చిక్కుకుపోయిన వారికి భారీ ఊరటను కల్పించారు. ప్రవాసులు రెసిడెన్సీ పర్మిట్ వీసా గడువు ఒకవేళ కనక ముగిసి ఉంటే దాన్ని మరో మూడునెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఇందుకు ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయమని స్పష్టం చేశారు. ఇక సౌదీకి వెలుపల ఉన్న వారికి కూడా మూడు నెలల పాటు ఈ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.
కరోనావైరస్ మహమ్మారి తర్వాత భవిష్యత్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి?
సౌదీకి వచ్చేందుకు ప్రవాసులు వీసాలు పొందినవారికి, అప్పటికే సౌదీలో వీసాతో ఉన్న వారికి అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో ఆ వీసా గడువు ముగిసింది. దీంతో వారు సౌదీని వదిలి వెళ్లాల్సి ఉంది. కొందరు తాము ఏ పనిమీద అయితే సౌదీకి చేరుకున్నారో లాక్డౌన్ కారణంగా అది నిలిచిపోయింది. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారని రాజు సల్మాన్ దృష్టికి రావడంతో అలాంటి వీసా దారులకు మూడు నెలల వీసా పొడిగిస్తూ రాజు ప్రకటన చేశారు. ఈ మేరకు సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.
కరోనావైరస్ మహమ్మారిపై నిరంతంర పోరాడుతున్న చర్యల్లో భాగంగానే వీసాలను పొడిగించాలన్న కొత్త నిర్ణయంను సౌదీ రాజు తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనావైరస్ మహమ్మారితో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని రాజు భావించారని అందుకే సాధ్యమైనంత వరకు అన్ని విషయాల్లో రాజు సల్మాన్ ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని అంతర్గత వ్యవహారాల శాఖ కొనియాడింది. ఇక కరోనావైరస్ ప్రభావంతో ప్రైవేట్ రంగాలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే... మహమ్మారి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.
Recommended Video
ఇక సౌదీ రాజు సల్మాన్ తాజాగా ప్రవాసుల మేలు కోసం తీసుకున్న నిర్ణయంతో లాక్డౌన్ సమయంలో సౌదీలో ఉన్నవారే కాకుండా సౌదీకి వెలుపల ఉన్న వారు కూడా లబ్ధి పొందనున్నారు. లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో చాలామంది వీసాలు ఉండి కూడా ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. అంతేకాదు సౌదీలో ప్రవేశించడంపై తాత్కాలికంగా నిషేధం విధించడంతో మరింత ఇక్కట్లు పడ్డారు.