కుదుటపడుతున్న కొలంబో! ఆత్మాహూతి దాడి చోటు చేసుకున్న స్టార్ హోటల్ లో పెళ్లి వేడుక
కొలంబో: చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఆత్మాహూతి దాడికి గురైన శ్రీలంక ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. రోడ్లపై జనసంచారం క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ స్తంభించిపోయిన జనజీవనం కాస్త మెరుగుపడుతోంది. దాడుల పీడకల నుంచి ప్రజలు బయట పడుతున్నారు. సాధారణ జనజీవనానికి అలవాటు పడుతున్నారు. ఆత్మాహూతి దాడితో మరుభూమిగా స్టార్ హోటల్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన చోట ఓ కొత్త జంట సరికొత్త జీవితానికి శ్రీకారం చుడుతోంది. కొలంబోలో ఆత్మాహూతి దాడి చోటు చేసుకున్న కింగ్స్ బరి స్టార్ హోటల్ గురువారం తెరచుకుంది. పెళ్లి వేడుకను నిర్వహించడానికి హోటల్ ను తెరచినట్లు యాజమాన్యం వెల్లడించింది.
ఆలయాల్లో చోరీలన్నీ చంద్రబాబు హయంలోనే !? అప్పుడు బెజవాడ..ఇప్పుడు తిరుపతి.. వైఎస్ఆర్సీపీ ఏం చెబుతోంది
కొలంబోలోని జనాధిపతి మవాటా ప్రాంతంలో ఉంటుందీ కింగ్స్ బరీ స్టార్ హోటల్. ఈస్టర్ సండే నాడు ఆత్మాహూతి దాడులకు గురైంది. పర్యాటకుడి రూపంలో హోటల్ లో అడుగు పెట్టిన ఆత్మాహూతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో సందర్శకులు దుర్మరణం పాలయ్యారు. ఛిద్రమైన శరీరాలతో యుద్ధక్షేత్రాన్ని తలపించిందా హోటల్. దాడి అనంతరం నిరవధికంగా దాన్ని మూసివేశారు.
ముందే- కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. గురువారం పెళ్లి వేడుకలను ఈ హోటల్ లో నిర్వహించారు. పెళ్లికి హాజరైన అహూతుల్లో ఏ ఒక్కరిలోనూ ఆనందం కనిపించట్లేదు. శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో హోటల్ కార్యకలాపాలను నిర్వహిస్తామని మేనేజింగ్ డైరెక్టర్ లలిన్ సమర విక్రమ తెలిపారు. హోటల్ గదుల కోసం అడ్వాన్స్ బుకింగ్ లను తెరిచామని చెప్పారు. కాగా- నేషనల్ ఇన్స్యూరెన్స్ ట్రస్ట్ నుంచి హోటల్ యాజమాన్యానికి బీమా రూపంలో కోటి రూపాయలకు పైగా మొత్తం అందినట్లు తెలుస్తోంది. సిన్నామన్ గ్రాండ్, షాంగ్రిలా గ్రాండ్ హోటళ్లు ప్రస్తుతానికి మూతపడ్డ దశలోనే ఉన్నాయి. ఈ వారాంతంలో ఈ రెండు హోటళ్లు కూడా తెరచుకోవచ్చని చెబుతున్నారు.