ప్యారిస్లో ఉన్మాది ఘాతుకం: కత్తితో దాడి, ఏడుగురికి తీవ్రగాయాలు
ప్యారిస్: ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో మరోసారి ఓ ఆగంతకుడు రెచ్చిపోయారు. ప్యారిస్ పర్యటనకు వచ్చిన టూరిస్టులపై కత్తితో దాడి చేశాడు. ఆదివారం అర్ధరాత్రి పారిస్లోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనంతో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా చుట్టూ ఉన్న వాళ్లపై కత్తి, ఐరన్ రాడ్తో దాడి చేశాడు. ఇద్దరు బ్రిటీష్ టూరిస్టులు సహా మరో ఐదుగురిని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు వెంబడించిన స్థానికులపై కూడా ఐరన్ రాడ్డుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు రాళ్లతో కొడుతూ అతడిని వెంబడించాడు.
అయినప్పటికీ అతడు వారి నుంచి తప్పించుకున్నాడు. కాగా, నిందితుడిని అఫ్ఘాన్ జాతీయుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా పరిగణించలేమని.. కేవలం అపరిచితులను లక్ష్యంగా చేసుకునే అతడు దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
గత కొన్ని నెలలుగా పారిస్లో ఇలాంటి ఘటనలు అధికమవడంతో పోలీసులు హై అలర్ట్ విధించారు. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈఫిల్ టవర్ వంటి పర్యాటక స్థలాల్లో నిఘా పెంచారు. ఐనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.