కత్తితో దాడి: ఏడుగురు విద్యార్థుల మృతి, మరో 12మందికి గాయాలు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న విద్యార్థులపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందగా, మరో 12మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
షాంషీ ప్రావిన్సులో అక్కడి కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6:10నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడి అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు.
బాధిత విద్యార్థులంతా 12-15ఏళ్ల వయసులోపే వారని అక్కడి మీడియా తెలిపింది. దాడికి పాల్పడిన 28ఏళ్ల నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఓ సాయుధుడు వంటగదిలో ఉపయోగించే కత్తితో 11మంది కిండర్ గార్డెన్ పిల్లలపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచాడు. గత ఫిబ్రవరిలో ఉత్తర చైనాకు చెందిన ఓవ్యక్తి స్థానిక షాపింగ్ మాల్లో కత్తితో దాడి చేసిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా 9మంది తీవ్రంగా గాయపడ్డారు.