కోహినూర్ వివాదంలోకి పాక్: తమదేనంటూ కోర్టుకు
ఇస్లామాబాద్: మనదేశానికి చెందిన అరుదైన కోహినూర్ వజ్రంకు సంబంధించిన వివాదంలో ఇప్పుడు పాకిస్థాన్ రంగంలోకి దిగింది. ఆ వజ్రాన్ని బ్రిటిషర్లు మన దేశం నుంచి కొల్లగొట్టారని కొందరు పేర్కొంటున్నప్పటికీ.. భారత ప్రభుత్వం మాత్రం దాన్ని ఎవ్వరూ ఎత్తుకెళ్లలేదు.. బహుమతిగానే ఇచ్చామని స్పష్టం చేసింది.
ఇదే విషయాన్ని ఇప్పుడు పాకిస్థాన్ పేర్కొంటుండటం గమనార్హం. 1849లో లాహోర్ ఒప్పందంలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి వజ్రాన్ని బహుమతిగా ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది.
కాగా, 'ఒక కంపెనీకి, రాజుకు మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా? అవిభాజ్య పంజాబ్లో ఎలాంటి నిబంధనలు అమలయ్యాయి? వాటి ప్రకారం కోహినూర్ వజ్రం ఈస్ట్ ఇండియాకు ఇవ్వడం సరైందేనా? ఈస్టిండియాతో ఇక్కడి వాళ్లు ఏమేం ఒప్పందాలు చేసుకున్నారు? వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మాకు ఇవ్వండి' అంటూ కోహినూర్ వజ్రం విషయంలో లాహోర్ హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
కోహినూర్ వజ్రం పాకిస్థాన్కే చెందుతుందని, ప్రస్తుతం బ్రిటిష్ రాజవశస్తుల నివాసం 'టవర్ ఆఫ్ లండన్'లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని పాక్కు తిరిగి తెప్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఒక వ్యక్తి లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం కోర్టుకు సమాధానం ఈ మేరకు సమాధానమిచ్చారు. 'లాహోర్ ఒప్పందంలో భాగంగా కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ కు బహుమానంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి పిటిషనర్.. దులీప్ సింగ్, ఈస్టిండియాల మధ్య జరిగిన ఒప్పందం చెల్లుబాటుకాదని వాదించారు.
కామన్వెల్త్ సభ్యుడిగా పాకిస్థాన్ మళ్లీ కోహినూర్ను పొందే అవకాశం ఉంటుందని, ఆమేరకు ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు పాత ఒప్పందాలన్నింటినీ సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోహినూర్ మనదేనంటూ భారత్ వాదిస్తుండగా.. ఇప్పుడు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్లు కూడా తమదేనంటూ వాదిస్తుండటం గమనార్హం.