కుల్ భూషణ్ జాదవ్కు న్యాయవాది ఏర్పాటుకు భారత్కు అనుమతివ్వండి: పాక్ హైకోర్టు
ఇస్లామాబాద్: కుల్ భూషణ్ జాదవ్కు న్యాయ సలహాదారు(న్యాయవాది)ని నియమించుకునేందుకు భారత్కు అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం పాకిస్థాన్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జాదవ్కు న్యాయవాదిని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం విచారించింది.
పాకిస్థాన్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు విచారణను సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. జాదవ్ కేసులో పాక్ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు హైకోర్టు గతవారం ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేసింది.
కాగా, ఇమ్రాన్ ఖాన్ సర్కారు సివిల్ కోర్టులలో సైనిక కోర్టు ఉత్తర్వులను సమీక్షించడానికి అనుమతించే ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టింది. దీనిపై అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కుల్ భూషణ్ జాదవ్కు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు నిరసనగా దిగాయి. ప్రభుత్వం వారి ఆరోపణలను ఖండించింది.
సైనిక కోర్టు ఆదేశించిన మరణశిక్షను సమీక్షించడానికి పాకిస్థాన్ను కోరిన అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు వివరించింది. జాదవ్కు ఉపశమనం కలిగించేందుకే రహస్యంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారన్న ఆరోపణలను న్యాయ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఐసీజే ఆదేశాలకు అనుగుణంగానే తమ సర్కారు చర్యలు తీసుకుంటోందని తెలిపింది.
ఇక మాజీ మాజీ నేవీ అధికారి అయిన జాదవ్కు న్యాయ ప్రతినిధిని నియమించేలా భారత్కు అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు సూచించిన నేపథ్యంలో న్యాయ సలహాదారుడిని పాకిస్థాన్ పంపేందుుక భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న భారత నిఘా ఏజెంట్ అంటూ కుల్ భూషణ్ జాదవ్ను పాకిస్థాన్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, పాక్ మిలిటరీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. దీంతో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. ఈ క్రమంలో ఐసీజే జోక్యంతో జాదవ్ మరణ శిక్ష నిలిచిపోయింది.