జైల్లో కులభూషణ్ జాదవ్కు చిత్రహింసలు? శశిథరూర్కూ అనుమానం, ఉగ్రవాదేనని పాక్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: గూఢచర్య ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను జైలు సిబ్బంది చిత్రహింసలకు గురి చేశారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
తల్లి, భార్యతో భేటీ అయిన సమయంలో ఆయన ఛిత్రాలు చూస్తే అలాగే ఉందని అంటున్నారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా అనుమానం వ్యక్తం చేశారు. జాదవ్ను చిత్రహింసలకు గురి చేస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు.
సోమవారం తల్లి, భార్యను కలుసుకున్న సమయంలో వారి మధ్య ఓ అద్దాన్ని అడ్డుగా పెట్టారు. ఈ సమయంలో తీసిన ఫోటోల్లో ఆయనకు గాయాలు ఉన్నాయని తెలుస్తోంది.
చదవండి: భారీ భద్రతా ఏర్పట్ల మధ్య పాక్ జైల్లో కులభూషణ్ జాదవ్ను కలిసిన తల్లి, భార్య
తలపై, చెవి వద్ద, మెడ భాగంలో గాయాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆయన చెవి పోగు కూడా లేదు. మానవా దృక్పథంతో ఈ భేటీకి అవకాశమిచ్చామని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ ఆయన పట్ల అమానుషంగా వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు, భద్రతా కారణాల వల్లే తల్లి, భార్యతో నేరుగా కాకుండా గ్లాస్తో భేటీ ఏర్పాటు చేశామని పాకిస్తాన్ చెబుతోంది. వారు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.
దీనిపై పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ మాట్లాడారు. ఈ భేటీతో జాదవ్పై తమకు ఉన్న అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదని, ఆయన ఓ ఉగ్రవాది, గూఢచారి అన్నారు. అతడికి మరణశిక్ష తప్పదన్నారు.
ఈ రోజు మహమ్మద్ అలీ జిన్నా జయంతి కాబట్టి మానవతా దృక్పథంతో కలిసేందుకు అవకాశమిచ్చామని చెప్పారు. తాను అస్లాం చౌదరిని హత్య చేసినట్లు, గూఢచారిని అని జాదవ్ అంగీకరించాడని చెప్పారు. జాదవ్ విషయంలో తాము ఏదీ దాచట్లేదన్నారు. మరోవైపు, తన కుటుంబంతో కలిసినందుకు పాక్కు జాదవ్ కృతజ్ఞతలుతెలిపారు. ఈ మేరకు పాక్ అధికారులు వీడియో విడుదల చేశారు.