తప్పిన పెనుముప్పు: టర్కీ ఎయిర్పోర్టుపై రాకెట్ లాంచర్లతో దాడి
ఇస్తాంబుల్: టర్కీ విమానాశ్రయం లక్ష్యంగా ఉగ్రవాదులు నాలుగు రాకెట్ లాంచర్లు ప్రయోగించారు. అయితే, అదృష్టవశాత్తు అవి కాస్త ఓ ఖాళీ స్థలంలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని అక్కడి వార్తా సంస్థ డాగన్ తెలిపింది.
ఈ వార్తా సంస్థ కథనం ప్రకారం.. టర్కీలోని దియార్బకిర్ విమానాశ్రయంలో కుర్దిశ్ ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు.ఎయిర్పోర్ట్ సమీపంలోని పోలీస్ కంట్రోల్ పోస్ట్ వద్ద రాకెట్ లాంచర్లతో మెరుపుదాడి చేయడంతో నగరం అంతా పేలుళ్లతో దద్దరిల్లింది. పరిసర ప్రాంతాల్లో నిలిపివున్న వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వాటికారణంగా ఏర్పడిన దుమ్ముదూళికి పలు నివాసాలవారు కిటికీలు మూసుకున్నారు. అయితే, అవి ఖాళీ స్థలంలో పడటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోలేదు.
పోలీసులు దాడి జరిగిన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్లే ప్రాంతాన్ని మూసేసి విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.కాగా, గత మూడు దశాబ్దాలుగా కుర్దీష్ తిరుగుబాటుదారులకు భద్రతా బలగాలకు మధ్య దాడులు జరుగుతున్నాయి.