కువైట్ రాజు సబ అహ్మద్ కన్నుమూత - కారణాలపై గోప్యత - రాజ్యానికి వారసుడు నవాఫ్ అహ్మద్
పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ పాలకుడు కన్నుమూశాడు. కువైట్ రాజు షేక్ సబ అల్ అహ్మద్ చనిపోయిన విషయాన్ని అమిరీ దివాన్ డిప్యూటీ మినిస్టర్ షేక్ అలీ అల్ జర్రా అల్ సబ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. చనిపోయేనాటికి కువైట్ రాజు వయసు 91 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు పలు ఆపరేషన్లు జరిగినా ప్రాణాలు దక్కలేదు. కాగా, ఆయన ఏ కారణంతో చనిపోయారనే విషయాన్ని రాచరిక ప్రభుత్వం వెల్లడించలేదు.
విదేశాల్లోనూ చికిత్స..
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న కువైట్ రాజు సబ అల్ అహ్మద్ వైద్య పరీక్షల నిమిత్తం జులై 18న అమిర్ ఆస్పత్రిలో చేరారని, అక్కడ నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైందని, ఆ తర్వాత జులై 23న అమెరికా వెళ్లి అధునాతన వైద్య చికిత్స కూడా తీసుకున్నారని మంత్రి అల్ జర్రా తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఆపరేషన్ ఎందుకు జరిగింది? అమెరికాలో ఎక్కడ చికిత్స తీసుకున్నారు? మరణానికి దారి తీసిన కారణాలేంటి? అనే వివరాలను మాత్రం గోప్యంగా ఉంచడం గమనార్హం.
ఇదీ అహ్మదీ ప్రస్థానం..
1929, జూన్ 16న కువైట్ సిటీలో జన్మించిన సబ అల్ అహ్మద్.. 2006, జనవరి 29న కువైట్ అమీర్(రాజు)గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన సోదరుడు, కువైట్ రాజుగా ఉన్న షేక్ బజర్ అల్ అహ్మద్ అల్ సబ ఈయనను 2003లో ప్రధానమంత్రిగా నియమించారు. అల్ సబా రాజవంశం నుంచి సబ అల్ అహ్మద్ 15వ పాలకుడు. 1963 నుంచి 2003 వరకు ఆయన కువైట్ విదేశీ వ్యవహారల మంత్రిగా పనిచేశారు. అరబ్ ప్రపంచంలో ప్రముఖ దౌత్యవేత్తగా, మానవతావాదిగా అల్ అహ్మద్ కీర్తిగణించారు.
కువైట్ రాజ వారసుడు తయార్..
రాజు షేక్ సబ అల్ అహ్మద్ అనారోగ్యం ముదిరే నాటికే వారసుడిని పరిపాలకుడిగా తయారుచేశారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచే రాచరిక వారసుడిగా షేక్ నవాఫ్ అహ్మద్ అల్ సబ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. అల్ అహ్మద్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత షేక్ నవాఫ్ అహ్మద్ పూర్తిస్థాయిలో కువైట్ రాజుగా నియమితులయ్యే అవకాశముంది. కువైట్ రాజు మరణంపై పలు దేశాల అధినేతలు సంతాపాలు తెలిపారు.