మనిషి మాంసం తిని బోర్ కొట్టింది: పోలీసులకు నిందితుడి షాక్, కుండలో అన్నీ అవే!
దక్షిణాఫ్రికాలోని అమాంగ్వే ప్రాంతంలో గత కొంత కాలంగా మనుషులు కనిపించకుండా పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
జోహెన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కానిబాలిజమ్(నరమాంస భక్షణ) కేసు సంచలనం రేపుతోంది. కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను సోమవారం స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
అంతకుముందు పోలీసుల ముందు లొంగిపోయిన సమయంలో నిందితుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు పోలీసులనే షాక్ తినేలా చేశాయి. 'నరమాంసం తిని బోర్ కొట్టింది..' అంటూ అతను వ్యాఖ్యానించడం గమనార్హం. ఆపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు.. తన వెంట తీసుకొచ్చిన ఒక కాలు, చెయ్యి తీసి వారి టేబుల్ మీద పెట్టాడు. దీంతో పోలీసుల గుండెలు అదిరిపోయాయి.
నిందితుడు చెప్పిన వివరాల మేరకు అతను నివసిస్తున్న ప్రాంతంలో తనిఖీలు చేయగా.. ఓ కుండలో మానవ అవయవాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురిలో ఒకరిని నాటువైద్యం చేసే మహిళగా గుర్తించారు.
కాగా, దక్షిణాఫ్రికాలోని అమాంగ్వే ప్రాంతంలో గత కొంత కాలంగా మనుషులు కనిపించకుండా పోతున్నారని పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా కేసు వెలుగుచూసింది. అంతకు ముందు ముగ్గురు వ్యక్తులు ఒక మహిళను చంపి, ముక్కలుగా నరికి, ఆమె అవయవాలు తినేసిన ఘటన వెలుగుచూసింది.