లడఖ్ మొదటి వేలు - చైనా టార్గెట్ లో మిగతా నాలుగు వేళ్లివే - టిబెట్ ఛీఫ్ వ్యాఖ్యల కలకలం...
గల్వాన్ లోయలో భారత సైనికుల హత్యలు దశాబ్దాల క్రితం నాటి వ్యూహంలో భాగమేనని అజ్ఞాతంలో ఉంటున్న టిబెట్ అధినేత లోబ్సాంగ్ సంగాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మిలిటరీ అధికారుల స్ధాయిలో చర్చల ప్రక్రియ సాగుతున్న తరుణంలో చైనా దుస్సాహసానికి ఒడిగట్టిందని ఇప్పటివరకూ భావిస్తున్న వారికి లోబ్సాంగ్ తాజా వ్యాఖ్యలు మింగుడుపడటం లేదు.
చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద గల్వాన్ లోయలో 20 మందికి పైగా భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడం అనూహ్యంగా చోటు చేసుకున్న ఘటన కాదని, ఇందులో భారీ వ్యూహముందని టిబెట్ అధినేత సంగాయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో చైనా జాతిపిత మావో జెడాంగ్ హయాంలోనే ఈ వ్యూహానికి అంకురార్పణ జరిగిందని, టిబెట్ ను అరచేతిగానూ, లడఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లతో కూడిన ఐదు వేళ్ల సిద్ధాంతం ఇందులో భాగమేనన్నారు.
మావో సిద్ధాంతం ప్రకారం అరచేతిగా ఉన్న టిబెట్ ను ఆక్రమించిన తర్వాత తొలి వేలైన లడఖ్ పై చైనా దృష్టిసారించిందని, ఆ తర్వాత క్రమంగా మిగతా వేళ్లయిన నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లపై చైనా దృష్టిసారిస్తుందని టిబెట్ ఛీఫ్ సంగాయ్ తెలిపారు.
గతంలో 2017లో చోటు చేసుకున్న డోక్లాం ఘటనతో పాటు తాజా పరిణామాలు కూడా చైనా ఐదువేళ్ల సిద్దాంతంలో భాగమని సంగాయ్ స్పష్టం చేశారు. దీనిపై గత 60 ఏళ్లుగా టిబెట్ నేతలు భారత్ ను హెచ్చరిస్తూనే ఉన్నారని సంగాయ్ చెప్పారు.