లాడెన్ మాకు ఒకప్పుడు హీరో: ముషార్రఫ్
లాహోర్: ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ ఖైదా ఉగ్రవాదులు ఒసామాబిన్ లాడె న్, అల్ జవహరి ఒకప్పుడు తమ హీరోలని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్కు చెందిన దునియా న్యూస్ చానల్కు మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం బయటపెట్టారు.
1990లో కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమం మొదలైనప్పుడు లష్కరే తోయిబా సహా 11 లేదా 12 ఉగ్రవాద సంస్థలు ఏర్పడ్డాయి. వాటికి పాక్ ప్రభుత్వం, సైన్యం పూర్తిగా సహకరించిందని, ఆ సంస్థల్లో చేరిన యువకులకు శిక్షణ ఇచ్చామని, వారు సరిహద్దులు దాటేందుకు సహకరించామని చెప్పారు.
2008 ముంబై ఉగ్రదాడి మాస్టర్మైండ్స్ సయీద్, లఖ్వీపై పాక్ చర్యలు తీసుకుంటుందా..? అని ప్రశ్నించగా భారత్కు సయీద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కానీ, పాక్లో యథేచ్ఛగా తిరుగడమే కాకుండా విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడని చెప్పారు, ఇందుకు పాక్ ప్రభుత్వం సర్వ సౌకర్యాలు సమకూరుస్తోందని ముషారఫ్ వెల్లడించారు.
కాశ్మీర్ స్వేచ్ఛకోసం పోరాడిన హఫీజ్ సయీద్, లఖ్వీలను హీరోలుగా ఆరాధించామని, ఆ తర్వాత మత పోరాటం (జిహాద్) ఉగ్రవాదంగా మారిందని చెప్పారు. ఇప్పుడు వాళ్లు (పాక్లోని ఉగ్ర మూకలు) సొంత ప్రజలనే చంపుతుండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
సయీద్, లఖ్వీని కూడా పాక్ నియంత్రిస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ముషారఫ్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. జిహాద్ 1979లో ఆఫ్ఘన్లో సోవియట్ రష్యా సైనిక దళాలను ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహమని, నేడు ప్రపంచాన్నే వణికిస్తున్న ఉగ్రవాదంగా మారిందని చెప్పారు. రష్యా దళాలపై పోరాటానికి తాలిబన్లకు తామే సైనిక శిక్షణ ఇచ్చామని చెప్పారు. తాలిబన్, హక్కానీ, ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి మాకు హీరోలని, ఆ తర్వాత విలన్లుగా మారారని తెలిపారు.