లఖ్వీని వదిలేయండి: లాహోర్ కోర్టు ఆదేశం, ముంబై దాడుల కేసుల నిందితుడు
పాకిస్థాన్: ముంబై 26/11 దాడుల ప్రధాన సూత్రధారి, లష్కర్ -ఏ-తోయిబా నాయకుడు జకి ఉర్ రహమాన్ లఖ్వీని విడుదల చెయ్యాలని లాహోర్ హైకోర్టు ఆదేశాలు జారి చేసింది. గురువారం కేసు విచారణ చేసిన హై కోర్టు లఖ్వీ నేరం చేశాడని మీరు అంటున్నారు, సరైన సాక్షాలు ఎందుకు సమర్పించలేదని పంజాబ్ ( పాకిస్థాన్) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పబ్లిక్ సెక్యూరిటి యాక్ట్ కింద పంజాబ్ ప్రభుత్వం (పాకిస్థాన్) లఖ్వీని అరెస్టు చేసి నిర్బంధించింది. లఖ్వీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు విచారణ చేసిన లాహోర్ హై కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ అన్వర్ ఉల్ హక్ పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేశారు.
"లఖ్వీపై ఆరోపణలు చేస్తున్నారు, అతని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసి నిర్బంధించారు. ఇంత జరిగిన తరువాత మీరు ఎందుకు సాక్ష్యాలు సేకరించలేకపోయారు" అని ప్రశ్నించారు. "మీరు సాక్షాలు సేకరించి న్యాయస్థానం ముందు సమర్పించండి తరువాత చూద్దాం" అని అన్నారు.
సరైన సాక్షాలు సమర్పించలేని కారణంగా నిర్బంధం ఎత్తివేస్తున్నామని, వెంటనే లఖ్వీని విడుదల చెయ్యాలని హైకోర్టు సూచించింది. రూ. 10 లక్షల విలువైన రెండు బాండ్లు కోర్టుకు సమర్పించాలని లఖ్వీ న్యాయవాదికి హైకోర్టు సూచించింది. తాము అన్ని సాక్ష్యాలు సమర్పించినా లఖ్వీని న్యాయస్థానం విడుదల చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అంటున్నారు.