హఫీజ్ సయీద్కు ఊరట: అరెస్ట్ చేయొద్దని లాహోర్ కోర్టు
ఇస్లామాబాద్:26/11 ముంబై పేలుళ్ల నిందితుడు జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్కు లాహోర్ హైకోర్టులో భారీ ఊరట ఇచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం తనను అరెస్టు చేయకుండా, గృహనిర్బంధంలో ఉంచకుండా నిరోధించాలంటూ అతడు పెట్టుకున్న పిటిషన్కు అక్కడి కోర్టు సానుకూలంగా స్పందించింది.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అతడిని అరెస్టు చేయడంగానీ, గృహ నిర్బంధంలో ఉంచడం గానీ చేయరాదంటూ పాకిస్తాన్, పంజాబ్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్టు పాక్ మీడియా ప్రకటించింది.
అమెరికా, భారత ప్రభుత్వాల ''అంతర్జాతీయ ఒత్తిడి'' మేరకు తనను మళ్లీ అరెస్టు చేసే ప్రమాదం ఉందంటూ సయీద్ తన పిటిషన్లో పేర్కొన్నాడు.ముంబై దాడుల్లో తన పాత్ర ఉందని నిరూపించేందుకు చాలా ఏళ్లుగా అమెరికా, భారత ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించాడు.
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం తనపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉందని.. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన జస్టిస్ అమీనుద్దీన్ ఖాన్ ఏప్రిల్ 4లోగా సమాధానం చెప్పాలంటూ పాకిస్తాన్, పంజాబ్ ప్రభుత్వాలకు ఆదేశించింది. 2008 నవంబర్ 26న లష్కరే తోయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు.
166 మందిని బలిగొన్న ఈ దాడుల వెనుక లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సూత్రధారి అని భారత్ ఆరోపిస్తోంది. ఈ ఘటన తర్వాత అతడిని అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. అతడి తలపై పది మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది.