మార్స్పై నీటి ప్రవాహం: జీవం కూడా ఉండొచ్చు(ఫోటో)
వాషింగ్టన్: అంగారకుడి (మార్స్) పైన ఉప్పు జల ప్రవానికి సంబంధించిన జాడలను గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. మార్స్ ఎక్స్ ప్లొరేషన్లో భాగంగా ఈ విషయాన్ని తెలుసుకున్నామని ప్రకటించారు. ఈ నీరు ప్రవహిస్తోందని తెలిపారు.
ఇక్కడ ఉన్న నీరు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నట్టు తేలిందని, పలుచోట్ల నీరు ఉన్న కారణంగా జీవం ఉండేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. నాసా విడుదల చేసిన ఛాయా చిత్రాల ప్రకారం అంగారక గ్రహంలోని నీరు చిక్కగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, అంగారకుడి పైన నీటి జాడలను కనుగొన్నామని గతంలోనే భారత్ ప్రకటించింది. అయితే, భారత్ వద్ద అత్యాధునిక సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో దీనికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాలను చూపలేకపోయింది. ఇప్పుడు ఇదే విషయాన్ని నాసా సాక్ష్యాలతో చూపడం గమనార్హం.
గతంలో భావించినట్లుగా అంగారకుడి పొడి, నిర్జల గ్రహం కాదని నాసా ప్లానెటరీ సైన్స్ సంచాలకులు జిమ్ గ్రీన్ చెప్పారు. కొన్ని పరిస్థితుల్లో జల ప్రవాహాన్ని గుర్తించామన్నారు. అంగారకుడి ఉపరితలంపై వేసవి నెలల్లో ఉప్పునీటి ప్రవాహాలు ఉండొచ్చనే అంశానికి తొలిసారిగా శాస్త్రవేత్తలు అధారాల్ని నిర్ధారించారు.
గ్రహం ఉపరితలంపై ఏటావాలుగా కనిపిస్తున్న ఆకృతులు ఉప్పునీటి ప్రవాహాలకు సంబంధించిన చారికలుగా భావిస్తున్నారు. ఇవి గ్రహాంతరంలో ద్రవరూప జలానికి ఆధారంగా విశ్వసిస్తున్నారు. తాము ఆర్ద్రీకరణం చెందిన ఉప్పు ఖనిజాలను గుర్తించామని, అవి ఏర్పడేందుకు నీరు అవసరమని అమెరికా, ఫ్రాన్స్ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.
ప్రస్తుతం అంగారకుడి పైన జలం ఉందనే అంశానికి ఈ ఫలితాలు బలమైన ఆధారాలన్ని ఇస్తున్నాయి. రికరింగ్ స్లోవే లీనియాగా వ్యహరించే సీజనల్ చారికలు నీటి ప్రవాహాల కారణంగా ఏర్పడినవేనని చాలాకాలంగా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.
అయితే, అంతరిక్ష నౌక రూపొందించిన చిత్రాలు పూర్తిస్థాయి స్పష్టత అందించలేకపోయాయి. రసాయన విశేషాలను విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచారు. అంగారకుడి మధ్యరేఖ వెంబడి ఇరుకైన కాలువల్లో నీటి సమక్షంలో మాత్రమే ఏర్పడే ఉప్పుకు సంబంధించి ఆధారాలను గుర్తించారు.