కరోనా దెబ్బకు వణకాల్సిందే..! అన్నీ మూసుకోవల్సిందే..! జూన్ వరకు లాక్ డౌన్ పొడిగించిన బ్రిటన్..!!
లండన్/హైదరాబాద్ : గ్రహచారం బాగా లేకపోతే మొలతాడే త్రాచుపామై కాటేస్తుందట. అత్యంత ధనిక దేశాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన దేశాలు కూడా కరోనా వైరస్ ముందు తలవంచి దాసోహం అంటున్నాయి. కరోనా కట్టడికి చేసేది ఏమిలేక స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి. అందుకు ఏ దేశం కూడా అతీతం కాదని చెప్పుకొస్తున్నాయి. తాజాగా బ్రిటన్ దేశం జూన్ వరకు లాక్ డౌన్ ను పొడిగించినట్టు ప్రకటించింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇదొక్కటే మార్గంగా దేశాలన్నీ లాక్ డౌన్ విదానాన్నే అమలు చేస్తున్నాయి. దాదాపు 120 దేశాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు ఈ స్వీయ నియంత్రిణ ఆయుధాన్నే వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది.
బ్రిటన్ కీలక నిర్ణయం.. జూన్ వరకూ ఆంక్షలు అమలు..
ప్రజల సంక్షేమం, భద్రత దృష్టిలో ఉంచుకుని దేశంలో జూన్ నెల వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కరోనా వ్యాధికి గురై.. చికిత్స పొంది కోలుకున్న అనంతరం, సుమారు పదిహేను రోజులుగా పాలనాపరమైన బాధ్యతలకు దూరంగా ఉన్న ఆయన గురువారం మొదటిసారిగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. బ్రిటన్ దేశంలో కరోనా ఇంకా కరాళ నృత్యం చేస్తూనే ఉన్నందున, లాక్ డౌన్ పొడిగించాల్సిందేనని పలువురు మంత్రులు ఆయనను కోరారు.
వినూత్న నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రధాని.. స్వాగతిస్తున్న యూకే వాసులు..
ఇక ఇదే సమావేశంలో దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశస్థులను వారి వారి స్వదేశాలకు ఎలా పంపివేయాలన్నదానిపైనా చర్చించారు. ఇండియాలో మాదిరే ఎగ్జిట్ ప్లాన్ ను తాము కూడా అమలు చేయడానికి బోరిస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించనున్నారు. ఇదిలా ఉండగా లాక్ డౌన్ ను ఎత్తివేసిన పక్షంలో వేలాది కరోనా రోగులు మృత్యు బాట పట్టవచ్ఛని, కరోనా మరింతగా విజృంభించే సూచనలు ఉన్నాయని డాక్టర్లు హెచ్చరించారు.
కరోనా వైరస్ కు మందులేదు.. స్వీయనియంత్రణే మార్గమంటున్న యునైటెడ్ కింగ్ డమ్..
దేశ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవానికి లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసి, జాతీయ ఆరోగ్య సేవలను ఒక సాధనంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం చూసిన పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సంఘం వార్నింగ్ ఇచ్చింది. డాక్టర్లలో మూడో వంతు మందికి తగినన్ని వ్యక్తిగత భద్రతా రక్షణ పరికరాలు లేవని, వారికి తగినన్ని కరోనా నివారణ సూట్లు లేక డాక్టర్ల డ్రస్ లనే కరోనా రక్షణ వస్త్రాలుగా వాడవలసి వస్తోందని ఈ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజా పరిణామాలను, అభ్యంతరాలను బేరీజు వేసుకున్న బ్రిటన్ ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రాణ నష్టం వద్దు.. ఓపిక పట్టండని బ్రిటన్ పౌరులకు ప్రధాని సందేశం..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆదేశ పౌరులు స్వాగతిస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల అమెరికా, చైనా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో జరిగిన ప్రాణనష్టం బ్రిటన్ లో సంభవించకూడదని ఆ దేశ ప్రజానికం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. మందు కనిపెట్ట బడని కరోనా మహమ్మారి పట్ల దేశ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని ప్రజల్లో ఐకమత్యంగా చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది. భారత దేశంతో పాటు అన్ని దేశాల లక్ష్యం కరోనా మహమ్మారి వైరస్ ను తరిమికొట్టడమే ననే అంశం స్పష్టమవుతోంది.