లాక్ డౌన్లపై బాంబు పేల్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఆ పరిస్థితి మరింత డేంజర్ అని ప్రకటన..
భారత్ కరోనాపై ఇప్పుడు పెద్ద యుద్దమే చేస్తోంది. వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించింది. ఇవీగాక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా లాక్ డౌన్ ప్రకటించాయి. అందులో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు,జార్ఖండ్,మహారాష్ట్ర తదిరత రాష్ట్రాలున్నాయి. లాక్ డౌన్ల కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యే అవకాశం ఉండటంతో వైరస్ గొలుసును అడ్డుకోవచ్చునని.. తద్వారా వ్యాప్తిని నియంత్రించవచ్చునని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే వైరస్పై పోరాటానికి కేవలం లాక్ డౌన్లు మాత్రమే సరిపోవంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రతినిధి మైక్ ర్యాన్ బాంబు పేల్చారు.
'ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది.. ఎవరు వైరస్ బారినపడ్డారో,అనారోగ్యం చెందారో వారిని గుర్తించడం.. ఐసోలేట్ చేయడం. కాబట్టి వాళ్ల ఆచూకీ కనిపెట్టి వీలైనంత త్వరగా వారిని ఐసోలేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప వారిని గుర్తించకుండా.. ప్రజా ఆరోగ్యం పరంగా బలమైన చర్యలు చేపట్టకుండా కేవలం లాక్డౌన్లు ప్రకటించడం అత్యంత ప్రమాదం.లాక్డౌన్లు ఎత్తివేసిన తర్వాత మహమ్మారి ఒక్కసారిగా మళ్లీ విజృంభించే అవకాశం ఉంటుంది.'అని మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.
ప్రతీ అనుమానితుడికి సరైన సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి కఠిన చర్యలతో ఆంక్షలు విధించిన చైనా, సింగపూర్, దక్షిణ కొరియా ఉదాహరణలు యూరోప్కు ఒక నమూనాను అందించాయని ర్యాన్ అన్నారు. ఒకసారి వైరస్ను నియంత్రించిన తర్వాత.. అక్కడితో సరిపెట్టకుండా.. ఆ తర్వాత కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వైరస్ నియంత్రణలోకి వచ్చిందని పోరాటాన్ని ఆపేయకూడదన్నారు.
వైరస్ నియంత్రణ కోసం చాలా వ్యాక్సిన్లు అభివృద్ది దశలో ఉన్నాయని చెప్పారు. అయితే ఒక్క అమెరికాలోనే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయని చెప్పారు. బ్రిటన్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందని మీడియా అడిగిన ప్రశ్నకు.. ప్రజలు వాస్తవికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్ కనుక్కొనే సమయానికి మనం మరింత విపత్తులోకి జారిపోవద్దన్నారు. వ్యాక్సిన్ తయారీకి కనీసం సంవత్సరం సమయం పట్టవచ్చునని తెలిపారు. ఏదేమైనా కేవలం లాక్ డౌన్లతో వైరస్ను ఎదుర్కోలేమని ర్యాన్ చెప్పడం భారత్కు ఒకరకంగా హెచ్చరిక లాంటిదేనని చెప్పాలి.