రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. భయంతో లండన్ ఎయిర్పోర్టు మూసివేత!
లండన్: సిటీ ఎయిర్పోర్టు రన్ వే సమీపంలో శక్తివంతమైన బాంబు కనిపించడంతో లండన్ నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్టును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
ఆదివారం థేమ్స్ నది ఒడ్డున కింగ్ అయిదో జార్జి డాక్ వద్ద నిర్మాణ పనులు చేపడుతున్న సమయలో ఈ బాంబు బయటపడింది. ఈ ప్రాంతం సిటీ ఎయిర్పోర్టుకు దగ్గర్లో ఉండడంతో ఎయిర్పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రయాణికులను బయటికి పంపిచివేసి ఆ బాంబును తొలగించే ప్రయత్నం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా సెప్టెంబరు 1940, 1941 మే నెలల మధ్యన లండన్ నగరంపై జర్మన్ ఎయిర్ఫోర్స్ దళాలు వేల సంఖ్యలో బాంబులను జార విడిచాయి.
వాటిలో ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చని, శక్తివంతమైన ఆ బాంబు అక్కడ పడి పేలకుండా ఉండి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లండన్ సిటీ ఎయిర్పోర్టు అధికారులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు.