48 గంటల తర్వాత టేకాఫ్ అయిన విమానం...అసలు జరిగిందేమిటి..?
లండన్లో నిలిచిపోయిన ఎయిరిండియా బోయింగ్ విమానం ఎట్టకేలకు టేకాఫ్ తీసుకుంది. లండన్ నుంచి ముంబైకు రావాల్సిన ఎయిరిండియా విమానం 48 గంటల తర్వాత టేకాఫ్ తీసుకుంది. మే 28 మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 1:15 గంటలకు బయలు దేరాల్సిన విమానం 48 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ విమానంలో మొత్తం 329 మంది ప్రయాణికులు ఉన్నారు.
విమానంలో ఆయిల్ లీక్ కావడంతో మరమత్తుల కోసం విమానాశ్రయంలోనే నిలిపి వేశారు. అయితే విమానం ఒక రోజు ఆలస్యంగా బయలుదేరుతుందని ముందుగానే ప్రయాణికులకు తెలిపింది ఎయిరిండియా సంస్థ. విమానంకు మరమత్తులు చేసేందుకు ఇంజనీర్ల బృందం ముంబై నుంచి లండన్కు వెళ్లే మరో విమానంలో మే 29న బయలుదేరింది. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు ఇతరత్రా లాంఛనాలు పూర్తికాగానే ప్రయాణికులకు విమానంలో లోపం తలెత్తిన విషయం తెలిపారు. ఇంకా విమానంలో లోపం గుర్తించలేదని ప్రయాణికులంతా తమ హోటల్ గదికే పరిమితం కావాలని ఎయిరిండియా సంస్థ తెలిపింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇక ముంబై నుంచి లండన్కు చేరుకున్న ఇంజినీర్లు విమానం మరమత్తుల కోసం తాము తీసుకొచ్చిన సామాన్లు సరిపోకపోవడంతో లండన్లో మళ్లీ కొనాల్సి వచ్చింది. సహనం కోల్పోయిన ప్రయాణికులు ఎయిరిండియా గ్రౌండ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక అప్పటికే తమ లగేజీ విమానాశ్రయంలో ఉన్నందున దాన్ని తమతో తీసుకురాలేక పోయామని అప్పటికే అర్థరాత్రి దాటినందున హీత్రో విమానాశ్రయంలో బ్యాగేజ్ కౌంటర్ మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులు. ఇక మరమత్తులు పూర్తి చేసుకున్న విమానం శుక్రవారం ఉదయం 3 గంటలకు ముంబై చేరుకోనుంది.