ఆగష్టు 5న చారిత్రక ఘట్టానికి వేదిక కానున్న టైమ్స్క్వేర్..ఏంటో తెలుసా..?
న్యూయార్క్ : ఆగష్టు 5వ తేదీన అయోధ్యలో రామజన్మభూమిలో రాముడి మందిరంకు శంఖుస్థాపన జరిగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్లో భూమి పూజ సమయంలో శ్రీరాముడి 3డీ ఫోటోలను భారీ హోర్డింగ్లపై ప్రదర్శించనున్నారు. ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫెయిర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ సెహానీ. సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసే సమయానికి టైమ్స్ స్క్వేర్లో కూడా ఫోటోలు ప్రదర్శిస్తామని చెప్పారు.
Recommended Video
ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లేలో ఈ 3డీ చిత్రాలను ప్రదర్శిస్తామని జగదీష్ చెప్పారు. ఇందుకోసం భారీ నాస్డాక్ స్క్రీన్, మరియు 17000 అడుగుల ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీన్లను లీజు కింద తీసుకొస్తున్నామని జగదీష్ వెల్లడించారు. ఆగష్టు 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీరాముడి ఫోటోలతో పాటు జైశ్రీరాం అని హిందీ ఇంగ్లీషులో ఉన్న పదాలను ప్రదర్శిస్తామని వివరించారు.వీటితో పాటు శ్రీరాముడి వీడియోలు, 3డీ రూపంలో రామాలయ నమూనా ప్రదర్శించడమే కాకుండా ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేసే సందర్భంలో ప్రత్యక్ష ప్రసారం కూడా టైమ్ స్క్వేర్ హోర్డింగులపై డిస్ప్లే చేస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే అమెరికాలో నివాసముంటున్న భారతీయులు కూడా ఆ రోజున టైమ్స్క్వేర్ ప్రాంగణానికి పెద్ద ఎత్తున చేరుకుంటారని చెప్పారు. ఆ రోజున ప్రతి ఒక్కరికి మిఠాయిలు పంచుతారని జగదీష్ స్పష్టం చేశారు. ఇలాంటి చారిత్రాత్మకమైన ఘట్టం మనిషి జీవితంలో ఒక్కసారే వస్తుందని చెప్పిన జగదీష్... అందుకే ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. శ్రీరాముడు ఆలయ నిర్మాణం భూమిపూజ వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు ఘనచరిత్ర ఉన్న టైమ్స్క్వేర్ కంటే వేదిక మరొకటేముంటుందని అన్నారు. మోడీ నేతృత్వంలో రాముడి ఆలయ నిర్మాణం జరుగుతుందంటే ప్రపంచ నలుమూలలా ఉన్న హిందువులకు ఎంతో గర్వకారణం అని అన్నారు. .
ఆరేళ్ల క్రితం వరకు ఆలయ నిర్మాణం జరుగుతుందని అది కూడా ఇంత త్వరగా ప్రారంభం అవుతుందని ఏనాడు అనుకోలేదని చెప్పిన జగదీశ్... ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అది ఇంత త్వరగా జరుగుతున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు.ఇక ఈ అద్భుతమైన కార్యక్రమం విజయవంతం చేసేందుకు చాలా మంది చాలా రకాలుగా తమకు తోచినంత సహాయం చేస్తున్నారని జగదీశ్ సెహానీ చెప్పారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ప్రధాని మోడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు. దీంతో ఆ ట్రస్టు స్వయంగా ప్రధానే భూమి పూజ చేయాల్సిందిగా ఆహ్వానం పంపడంతో ఇందుకు ప్రధాని అంగీకరించారు.