మాజీ ప్రేయసి పెంపుడు కుందేలును తిన్న నటుడిపై కేసు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా లాస్ ఏంజెలెస్కు చెందిన దిమిత్రి డయట్షెంకో (46) అనే టీవీ నటుడు తన మాజీ ప్రియురాలి పెంపుడు కుందేలును తినేశాడు. చంపి, తోలుతీసి భోంచేశాడు. దాంతో సంతృప్తి చెందుకుండా తన మాజీ ప్రేయసిని కూడా కుందేలు తరహాలోనే తోలు తీసి చంపేస్తానని బెదిరించాడు. ఇప్పుడతనిపై జంతు హింస, క్రిమినల్ బెదిరింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
ఇద్దరం కలిసి ఉండడం ఇక కుదరదని మాజీ ప్రేయసి చెప్పడంతో అతనికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. ఆ కారణంతోనే దిమిత్రి ఈ కిరాతక చర్యకు ఒడిగట్టాడు. తొలుత కుందేలును చంపాడు. అనంతరం దాని తోలు వలిచి, ముక్కలుగా కోసి వండాడు. ఆ ఫొటోలను ఒక్కొక్కటిగా మాజీ ప్రేయసికి పంపాడని అధికారులు బుధవారంనాడు చెప్పారు.
కాగా, నేరం నిరూపితమైతే దిమిత్రికి నాలుగేళ్లకు పైగా శిక్ష పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. దిమిత్రి బెయిల్పై బయటే ఉన్నాడు. దానిపై అతని మేనేజర్ బారీ బూకిన్ మాట్లాడడానికి నిరాకరించారు.
ఆమెతో కొంత కాలంగా దిమిత్రి కలిసి ఉంటున్నాడని, అయితే వారిద్దరు విడిపోయారని లాస్ ఏంజెలెస్ కౌంటీ ప్రాసిక్యూటర్ చెప్పారు. రూమ్మేట్స్కు ఉండడం కుదరదని ఆమె దిమిత్రికి చెప్పిందని అన్నారు. డిసెంబర్ 7వ తేదీన ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లగానే అతను కుందేలుపై తన ప్రతాపం చూపించాడు.
శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన దిమిత్రి నటుడు మాత్రమే కాకుండా సంగీతకారుడు కూడా. టెలివిజన్పై రష్యన్స్, తూర్పు ఐరోపాల్లో నటించాడు. ఇండియానా జోన్స్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ ద క్రిస్టల్ స్కల్ అనే సినిమాలో చిన్న పాత్ర కూడా వేశాడు.