ఎల్టీటీఈ ప్రభాకర్ బతికున్నాడా!?: మిస్సింగ్ లిస్ట్లోకి..
కొలంబో: ఎల్టీటీఈ ప్రభాకరణ్ హతమై ఏడేళ్లు అవుతోంది. అయినా ఆయన పేరు 'మిస్సింగ్' జాబితాలో పేర్కొంటానని చెబుతుండటం గమనార్హం. శ్రీలంక ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్కు ప్రభాకరన్ పేరును సూచిస్తానని శ్రీలంక తమిళ నేషనల్ అలయన్స్ నాయకుడు శివలింగం అన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 2009లో ప్రభాకర్ను హతమార్చినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేసింది.
శ్రీలంకలోని ప్రభాకరన్ సోదరుడు లేదా సోదరి కానీ ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్లో పేరు నమోదు చేయాలనుకుంటే తాను అండగా నిలుస్తానని చెప్పారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్ను స్థాపించనున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీని స్థాపన అంటే ఎల్టీటీఈతో పోరాడిన సైనికులను మోసం చేయడమే అంటున్నారు. 2009లో పోరు ముగిసిన తర్వాత నుంచి ఇప్పటి దాకా దాదాపు పదహారు వేల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు.