మోడీ టూర్: చైనాలో అనూహ్య పరిణామాలు: నిశితంగా: జాతీయ భద్రతా సలహాదారుడి మార్పు:హాంకాంగ్ కోసం
బీజింగ్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకస్మిక పర్యటనపై చైనా కన్నేసిందా? జాతీయ భద్రతా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందా? సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఏకంగా సరిహద్దులకు బయలుదేరి వెళ్లడం.. అక్కడే మకాం వేయడం.. దేశ రక్షణశాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం వంటి పరిణామాలను చైనా నిశితంగా పరిశీలిస్తోంది. డేగ కన్ను వేసింది. ప్రతి అంశాన్ని ఆసక్తికరంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
చైనాతో అమీతుమీ: లఢక్లో మోడీ: ముగ్గురు కీలక మంత్రులతో హైలెవెల్ భేటీకి పిలుపు: కీలక నిర్ణయం?
జాతీయ భద్రతా సలహాదారుడి మార్పు
నరేంద్ర మోడీ లఢక్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సమయంలోనే.. చైనాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైనా సెంట్రల్ ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారుడి స్థానంలో మార్పులు చేర్పులు చేసింది. ల్యువో హ్యునింగ్ను జాతీయ భద్రతా సెంట్రల్ కమిటీ సలహాదారుడిగా నియమించింది. ఈ నియామకంతో భారత్కు సంబంధం లేదు. హాంకాంగ్ను తన పరిధిలోకి తెచ్చుకున్న చైనా.. తన దేశ జాతీయ భద్రతా చట్టాలను అక్కడ అమలు చేస్తోంది. దీన్ని పర్యవేక్షించడానికి, సమన్వయ పర్చడానికీ ల్యువో హ్యూనింగ్ను నియమించింది. దీనికి అదనంగా మరి కొన్ని బాధ్యతలను ఆయనకు అప్పగించింది.
నరేంద్ర మోడీ పర్యటన సమయంలోనే..
నరేంద్ర మోడీ లేహ్ పర్యటన కొనసాగిస్తోన్న సమయంలోనే జాతీయ భద్రతా సలహాదారుడిగా ల్యువో హ్యూనింగ్ను నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నరేంద్ర మోడీ పర్యటనను తాము నిశితంగా పరిశీలిస్తున్నామనే సంకేతాలను చైనా పంపించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వద్ద ఘర్షణల అనంతరం భారత్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేసుకుంది. చైనా సంస్థలకు అప్పగించిన కాంట్రాక్టులను పక్కన పెట్టేసింది. 59 యాప్లను నిషేధించింది.
అదే తరహాలో..
వ్యాపార, వాణిజ్య సంబంధాలను తెంచుకోవడం మొదలుకుని, యాప్ల నిషేధం దాకా భారత్ వేస్తోన్న ప్రతి అడుగునూ చైనా పాలకులు నిశితంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. యాప్ల నిషేధంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం తీవ్రంగా స్పందించింది. భారత చర్యను తప్పు పట్టింది. అదే తరహాలో... నరేంద్ర మోడీ పర్యటనపైనా చైనా కన్నేసిందని అంటున్నారు. లేహ్లో పర్యటన ముగించుకున్న అనంతరం.. నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవచ్చనే అంశాన్ని చైనా ప్రభుత్వం విశ్లేషిస్తున్నట్లు అక్కడి మీడియా చెబుతోంది.
హాంకాంగ్ బాధ్యతలన్నీ ల్యువో చేతుల్లో..
హాంకాంగ్ను విలీనం చేసుకుంటూ రూపొందించిన ప్రతిపాదనలను చైనా కొద్దిరోజుల కిందటే పార్లమెంట్లో ఆమోదించింది. చైనాలో అమలు చేస్తోన్న జాతీయ భద్రతా చట్టాలను హాంకాంగ్లోనూ అమలు చేయడంతో.. విలీన ప్రక్రియ ముగిసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం చైనా ఆ పనిలో ఉంది. హాంకాంగ్లో చైనా జాతీయ భద్రతా చట్టాలను అమలు చేయడంతో పాటు.. దాన్ని సమన్వయం పర్చడం, పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను ల్యువో చేతుల్లో పెట్టింది చైనా. గ్వాంగ్డాంగ్ ప్రావిన్షియల్ పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేస్తోన్న ల్యువోను కొత్తగా జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది.