ఏనుగు పేడతో బ్లాక్ ఐవరీ కాఫీ: కప్ ధర 850
బ్యాంకాగ్: పర్యాటకులను ఆకర్షించడానికి ప్రపంచంలోని దేశాలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో థాయ్లాండ్ ముందు వరసలో ఉంటుంది. థాయ్లాండ్ లోని రెస్టారెంట్లు, హోటళ్లు, కాఫీ హౌస్ లు వివిధ రుచులతో పర్యాటకులను ఆకర్షించడంలో పోటీ పడుతుంటాయి.
ఈ పోటీని దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి విచిత్రమైన ప్లాన్ వేశాడు. అతని ప్లాన్ విజయవంతమైంది. అతను అనుకున్నదాని కంటే వ్యాపారం రెండింతలు అయ్యింది. అతను కాఫీ గింజలు, ఏనుగు పేడను పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నాడు.
బ్లేక్ డిన్ కిన్ అనే వ్యక్తి బ్లాక్ అవరి కాఫీని కనిపెట్టాడు. భారత కరెన్సీ ప్రకారం ఆ ఒక్క కాఫీ విలువ రూ.850. అతను ఆ కాఫీని ఎలా తయారు చేయించాడు అనే విషయం ఆసక్తికరంగా ఉంది. అతను వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మొదట ఒక ఏనుగుకు 35 కిలోల కాఫీ గింజలు తినిపిస్తారు. ఏనుగు కాఫీ గింజలను జీర్ణం చేసుకున్న తరువాత పేడ వేస్తుంది. ఆ పేడలో ఒక కిలో కాఫీ గింజలు బయటపడుతాయి. ఆ గింజలను సేకరించి శుభ్రంగా కడిగి ఎండపెడతారు. తరువాత 19వ శతాబ్దానికి చెందిని ఫ్రెంచ్ కాఫీ మిషన్ లో గింజలు వేస్తారు.
ఆ మిషన్ తీసుకు వచ్చి పర్యాటకుల టేబుల్ మీదనే వేడివేడి కాఫీ తయారు చేసి ఇస్తారు. ఈ కాఫీ వగరు రుచితో ఉంటుంది. థాయ్లాండ్ లో పర్యాటకులను ఈ బ్లాక్ ఐవరి కాఫీ విపరీతంగా ఆకట్టుకునింది. ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం ఈ కాఫీ థాయ్లాండ్ తో పాటు, సింగపూర్, హాంకాంగ్ లో అందుబాటులో ఉంది.
ఏనుగు పేడలో నుండి వచ్చే ఈ కాఫీ గింజలకు ఎక్కువ డిమాండ్ ఉందని, ఒక్కోసారి ఏనుగులు నీటిలోకి వెళ్లి పేడ వేసిన సమయంలో కాఫీ గింజలు అక్కడే వృధా అవుతున్నాయని బ్లేక్ డిన్ కిన్ అంటున్నాడు. కాఫీ గింజలు సేకరించడానికి మావటీలకు కూలి ఇస్తున్నానని చెబుతున్నాడు.
అందువలనే కాఫీ గింజల ధర పెరిగిపోయిందని త్వరలో మరిన్ని గింజలు తయారు చేసి మాస్కో, పారిస్, జూరిచ్ కోపెన్ హాగన్ తదితర దేశాలకు సరఫరా చేస్తానని బ్లేక్ డిన్ కిన్ అంటున్నాడు. మొదట చిన్న పిల్లలు, సింహాలకు కాఫీ గింజలు తినిపించి గింజలు సేకరించానని, అయితే అది సక్సస్ కాలేదని వివరించాడు.