ఇదో మిరాకిల్: కేవ్ ఆపరేషన్లో ఇద్దరు ఇండియన్స్ వీరే, 'మేడిన్ ఇండియా' సహాయం ఇలా
న్యూఢిల్లీ/బ్యాంకాక్: థాయ్లాండ్లోని తామ్ లువాంగ్ గుహల్లో చిక్కుకున్న 12 మంది బాలురు, కోచ్ను 18 రోజుల తర్వాత కాపాడిన విషయం తెలిసిందే. ఈ రెస్కూ ఆపరేషన్లో భారత్కు చెందిన కిర్లోస్కర్ కంపెనీ పాత్ర కూడా ఉంది. ఈ కంపెనీ తరఫున ఇద్దరు ఇంజినీర్లు పాలుపంచుకున్నారు. గుహలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకు రావడానికి కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ సాంకేతిక సాయం అందించింది.
ట్విస్ట్.. గుహలో ధ్యానంలో చిన్నారులు?: వారిని కాపాడటంలో భారత కంపెనీ సహకారం
గుహలో నీటిమట్టం తగ్గించడానికి అవసరమైన సామాగ్రి, సాంకేతికత తమ కంపెనీకు ఉన్నాయని భారత రాయబార కార్యాలయం థాయ్లాండ్ అధికారులకు తెలిపింది. థాయ్ ప్రభుత్వం అంగీకరించడంతో కిర్లోస్కర్ రంగంలోకి దిగింది. భారత్తో పాటు థాయ్లాండ్, యూకేలోని తమ కార్యాలయాల నుంచి నిపుణులను గుహ వద్దకు పంపించింది.
థాయ్ కేవ్ ఆపరేషన్లో భారతీయ కంపెనీ, ఆ ఇద్దరు వీరే
ఆ కంపెనీ మొత్తం ఏడుగురు నిపుణులను పంపించింది. అందులో ఇద్దరు భారత్ నుంచి వెళ్లారు. వారు మహారాష్ట్రకు చెందిన ప్రసాద్ కులకర్ణి, శ్యామ్ శుక్లాలు. కిర్లోస్కర్ కంపెనీలో ప్రసాద్ ప్రొడక్షన్ డిజైన్ హెడ్ కాగా, శ్యామ్ కార్పోరేట్ రీసెర్చ్ జనరల్ మేనేజర్. కిర్లోస్కర్ కంపెనీకి చెందిన నిపుణులు జూలై 5వ తేదీ నుంచి గుహ వద్దే ఉన్నారు. సహాయక చర్యలకు అనుగుణంగా గుహ నుంచి నీటిని బయటకు పంపించడం వీరి పని. మధ్యమధ్యలో వర్షం కురవడంతో నీటి స్థాయి పెరిగినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో చిన్న పంపుల సాయంతో నీటిని తోడారు. మేడిన్ ఇండియా వాటర్ పంపులు పదమూడు మందిని కాపాడటంలో సహాయపడ్డాయి.
ఇది ఓ మిరాకిల్
ఇదిలా ఉండగా గుహలో చిక్కుకున్న పదమూడు మందిని రక్షించడం ఓ మిరాకిల్ అంటున్నారు. ఓ వైపు వర్షాలు, మరోవైపు ఇరుకైన గుహ, అనుకూలించని వాతావరణం.. ఇన్ని ఇబ్బందుల మధ్య వారిని కాపాడారు. గుహలో వారి జాడ పది రోజుల తర్వాత తెలిసింది. ఆ తర్వాత వారిని బయటకు తెచ్చేందుకు వారం పాటు ఎన్నో ప్రత్యామ్నాయాలు చూశారు.
తొమ్మిది నుంచి 11 గంటల సమయం
ఆ తర్వాత ఆదివారం సహాయక చర్యలు ప్రారంభించి తొలి రోజు నలుగురిని, సోమవారం నలుగురిని, మంగళవారం ఐదుగురిని తీసుకు వచ్చారు. ప్రస్తుతం అందరూ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇందుకు డైవర్లు చేసిన కృషి ఎంతో ఉంది. గుహలోకి వెళ్లి వచ్చేందుకు డైవర్లకు తొమ్మిది నుంచి 11 గంటల సమయం పట్టింది.
ఇది ఒక అద్భుతమే
ఏమాత్రం కనిపించకుండా చీకటి, ఇరుకైన గుహలో ఎన్నో ఇబ్బందులతో ఈది వారిని బయటకు తీసుకు వచ్చారు. ఇదో అద్భుతమని అందరూ కొనియాడుతున్నారు. ఇది మిరాకిలా, సైన్సా, ఇంకేదైనానా.. అని ఓ అధికారి పేర్కొన్నారు. ఓ డైవర్ వారిని కాపాడేందుకు ఏకంగా 9 రోజుల పాటు 63 గంటలు గుహలో గడిపాడు.
వారి కోసం స్వచ్చంధంగా
బాలురను, కోచ్ను కాపాడటం కోసం గుహ వద్దకు పెద్ద ఎత్తున డైవర్లు, నిపుణులు, జర్నలిస్టులు వచ్చారు. దీంతో అక్కడకు కొందరు వచ్చి ఆహార, పానీయాలను ఉచితంగా అందించారు. సమీపంలోని గ్రామస్థులు కాఫీ స్టాల్స్, డైవర్ల కోసం మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.