వైట్ హౌజ్ను పేల్చేస్తా..: వివాదస్పద వ్యాఖ్యలపై మడోన్నా వివరణ
తన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను అని మడోన్నా ఈ సందర్బంగా పేర్కొన్నారు. తాను హింసను ఏమాత్రం సహించనని, అందుకు మద్దతు తెలిపేది లేదన్నారు. నేను ర్యాలీలో చేసిన ప్రసంగంలో ఒకేఒక్క వాక్యాన్ని తప్పుగ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పాప్ సింగర్ మడోన్నా దానికి వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలు దురుద్దేశంతో చేసినవి కావని, ఒకే ఒక్క వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.
అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ను కూల్చివేస్తానని మడోన్నా ఇటీవలే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కు వ్యతిరేకంగా రాజధాని వాషింగ్టన్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మడోన్నా.. ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
దీంతో సోషల్ మీడియా వేదికగా మడోన్నా వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మడోన్నా తన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 'నిన్న వాషింగ్టన్ ర్యాలీ మంచి అనుభవాన్నే ఇచ్చింది. నేనేదైతే చెప్పాలనుకున్నో.. ర్యాలీలోను అదే చెప్పాను.' అని తెలిపారు.
తన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను అని మడోన్నా ఈ సందర్బంగా పేర్కొన్నారు. తాను హింసను ఏమాత్రం సహించనని, అందుకు మద్దతు తెలిపేది లేదన్నారు. నేను ర్యాలీలో చేసిన ప్రసంగంలో ఒకేఒక్క వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మడోన్నా అన్నారు.
'ప్రపంచంలో మార్పు సాధ్యమయ్యేది కేవలం ప్రేమతోనే. అనవసర విషయాలతో విడివడకుండా ఐకమత్యంగా ఉండాలి, దాని ద్వారానే ప్రపంచంలో సానుకూల మార్పులు వస్తాయి' అని మడోన్నా తెలియజేశారు.
కాగా, గతేడాది జరిగిన అమెరికన్ ఎన్నికల ప్రచారంలోను ట్రంప్ గెలవకూడదంటూ మడోన్నా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, మొన్నటి వాషింగ్టన్ ర్యాలీలోమడొన్నాతో పాటు ప్రముఖులు మైలీ సైరస్, జులియా రాబర్ట్స్, స్కార్లెట్ జోహాన్సన్, కేటీ పెర్రీ, ఎమ్మా వాట్సన్తో సహా 500,000 మంది పాల్గొన్నారు.