అమెరికా ఘోస్ట్టౌన్: వణికించిన పెనుభూకంపం: 15 నిమిషాల్లో ఏడుసార్లు: జియాలజిస్టుల్లో కలకలం
వాషింగ్టన్: అమెరికాలో పెనుభూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా రికార్డయింది. ప్రధాన భూకంపం తరువాత కూడా ఏడుసార్లు వెంటవెంటనే ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఈ ఉదంతం భూగర్భ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ స్థాయిలో ప్రకంపనలు చోటు చేసుకోవడం అరుదుగా భావిస్తున్నారు. దీనికి గల కారణాలపై అన్వేషణ చేపట్టారు. భూ ఫలకాల్లో సంభవించిన మార్పులు, సర్దుబాటు వల్ల ప్రకంపనలు నమోదు అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Moderate 5.2 earthquake: 15:32:56 on 12/01. Loc: 24 km S of Mina, NV. Depth: 6.3 mi https://t.co/dVESbmdeft https://t.co/xGp7AQy89H
— CA/NV Earthquakes (@CAquake) December 1, 2020
అమెరికా కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:32 నిమిషాలకు నెవడాలో భూకంపం సంభవించింది. సెంట్రల్ నెవడాలోని క్యాండెలారియాలో భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ క్యాండెలారియాకు ఘోస్ట్ టౌన్గా పేరుంది. ఇక్కడ మనుషులెవరూ నివసించట్లేదు. ఈ ప్రాంతం మొత్తం గనులతో కూడుకుని ఉంటుంది. తవ్వకాల కార్యక్రమాలేవీ కొనసాగట్లేదని తెలుస్తోంది. నెవడాలోని దక్షిణ మినా ప్రదేశానికి 24 కిలోమీటర్లు, కాలిఫోర్నియాలోని మోనో లేక్ ప్రాంతానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఘోస్ట్ టౌన్.
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్లు అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. ఆ వెంటనే 15 నిమిషాల్లో ఏడుసార్లు ప్రకంపనలు నమోదు అయ్యాయని పేర్కొంది. వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.5 నుంచి 4.3గా నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాది ఇదే ప్రాంతంలో రెండుసార్లు భూకంపం సంభవించింది. మే 15వ తేదీన 6.5, కిందటి నెల 13న 5.3 తీవ్రతతో సెంట్రల్ నెవడాలోనే భూకంపాలు చోటు చేసుకున్నాయి.
Light 4.4 earthquake: 20:49:28 on 12/01. Loc: 24 km S of Mina, NV. Depth: 5.0 mi https://t.co/iAmSCfiEVp https://t.co/YdQiojPC34
— CA/NV Earthquakes (@CAquake) December 2, 2020
దాని పరిసర ప్రాంతంలోనే 5.1 తీవ్రతతో మళ్లీ భూకంపం రావడం, దాని తరువాత 15 నిమిషాల వ్యవధిలో ఏడుసార్లు భూమి ప్రకంపించడం భూగర్భ శాస్త్రవేత్తలకు చేతినిండా పని పెట్టినట్టయింది. గనులు అధికంగా ఉండటం వల్ల భూకంపాలు వెంటవెంటనే చోటు చేసుకోవడానికి ఓ కారణమై ఉండొచ్చని వారు భావిస్తున్నారు. తాజా భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా సమాచారం లేదు. దీనిపై స్థానిక అధికారులు ఆరా తీస్తున్నారు.